Home తెలంగాణ ఒకే ఊరు నుండి 12 మంది డాక్టర్లు

ఒకే ఊరు నుండి 12 మంది డాక్టర్లు

508
0
12 doctors from laxmipur

ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని ఆ గ్రామంలో పసుపు, వరి, మొక్కజొన్న వంటి మిశ్రమ పంటలు సాగు చేసి రైతులు మంచి ఆదాయం పొందుతుంటారు. రైతులంతా రాజకీయాలకు అతీతంగా సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తమ ఉత్పత్తులను నేరుగా మార్కెటింగ్‌ చేసుకుంటూ ఆదర్శ రైతులుగా మారి, ఆ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారు. అలాంటి గ్రామంలో సరస్వతీ కళ కూడా తాండవిస్తోంది. ఆ గ్రామమే లక్ష్మీపూర్‌.

తెలంగాణ లోనే ఎక్కడా లేని విధంగా ఒక్క లక్ష్మీపూర్‌ గ్రామం నుంచే దాదాపు 12 మంది డాక్టర్లు ఉండటం గమనార్హం. ఇందులో ఇప్పటికే నలుగురైదుగురు డాక్టర్లు తమ వైద్య వృత్తిని కొనసాగిస్తుండగా, మరికొందరు త్వరలోనే వైద్య విద్యను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం వైద్యులుగా కొనసాగుతున్న మేడిపల్లి ప్రియాంక– శ్రీనివాస్‌రెడ్డిలు హైదరాబాద్‌లో గైనకాలజి ప్రైవేట్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేయగా, డాక్టర్‌ జయంతి–డాక్టర్‌ ఉదయ్‌ జగిత్యాలలో గైనకాలజి ప్రైవేట్‌ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. అలాగే డాక్టర్‌ కొప్పెర మహేశ్‌– శిరీష జగిత్యాలలో ఆర్థోపెడిక్‌ అసుపత్రిని ఏర్పాటు చేయగా, అటుకుల రాహుల్‌ ఎంబీబీఎస్‌ పూర్తి కాగా, పీజి కోసం ప్రిపేర్‌ అవుతున్నాడు.

ఇక గర్వందుల శరణ్య ఎంబీబీఎస్‌లో భాగంగా హౌస్‌ సర్జన్‌ చేస్తుండగా, నాతర్ల సంజీవ్‌ బీడీఎస్‌ పూర్తి చేసి ఎండీఎస్‌ చదువుతుండగా, ఎర్రవేల్లి శ్రీనాథ్, పన్నాల మధు, గడ్డం గోవర్ధన్‌రెడ్డిలు ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. ఇంకా గర్వందుల నందిని బీడీఎస్‌ చదువుతుంది. వీరిని చూసిన మరికొందరు కూడా ఆ గ్రామం నుంచి వైద్య విద్యను అభ్యసించేందుకు ముందుకు వస్తుండటం విశేషం. అందరూ కూడా మంచి ర్యాంకులు సాధించి ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు సాధించినవారే కావడం మరీ విశేషం. ఈ మధ్యనే డాక్టర్లు అయినవారిని, డాక్టర్లు కాబోతున్న వారిని లక్ష్మీపూర్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులు సన్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here