– ప్రజల మేలుకే నూతన చట్టం
– భూసమస్యల నియంత్రణే లక్ష్యం
– రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్ అక్టోబర్ 1: దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభం అవుతుందని రాష్ట్ర బిసి సంకేమ, పౌరసరఫరాల శాక మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా తెలంగాణాలో భూభాగం మొత్తం రికార్డు చేయడమే లక్ష్యంగా ధరణి పోర్టల్ రూపుదిద్దుకుంటున్నది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రజాప్రతినిధులకు తెలియచేసేందుకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండ లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా వ్యాప్తంగా భూ సమస్యలు లేకుండా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి గంగుల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. భూసర్వేకు సంబంధించి, నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించి వారు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు అందరూ సమగ్ర అవ గాహన కల్పించుకోవాలని సూచించారు.

క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా తెల్సుకొనేందుకే సమీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసేయడమే లక్ష్యంగా శ్రమిస్తున్నామని తెలిపారు. తెలంగాణా వ్యాప్తంగా రెండు కోట్ల 77 లక్షల ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇదంతా ధరణి పోర్టల్ లో రికార్డు కావాల్సిందేనని ఆయన అన్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూమలు అన్నీ నమోదు చేస్తామని, ఒక్కసారి నమోదు చేసిన తర్వాత పేరు మార్పిడికి తప్ప ఇతర అంశాలకు తావు ఉండదని ఆయన తెలిపారు.
అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా భూములు నమోదు చేస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఒక్క క్లిక్ ద్వారా భూముల వివరాలు తెల్సుకోవచ్చని మంత్రి చెప్పారు. ఎలాంటి టాంపరింగుకు అవకాశం లేని విధంగా ధరణి పోర్టల్ రూపొందుతోందని మంత్రి అన్నారు. ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ప్రజలకు సమాచారం అందించి అన్ని భూముల వివరాలు నమోదు అయ్యేలా ప్రయత్నించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ఆర్డీవో ఆనంద్ కుమార్, డి.పి.వో. వీర బుచ్చయ్య, ఎంపీపీలు పిల్లి శ్రీలత-మహేశ్, తిప్పర్తి లక్ష్మయ్య, జడ్పీటీసీలు పిట్టల కరుణ, పురుమల్ల లలిత, ప్యాక్స్ ఛైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి, తహసీల్దార్లు, పలువురు సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.