– నాణ్యత లోపిస్తే చర్యలు
– మేయర్ అనిల్కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, డిసెంబర్ 15: నాణ్యత లేకుండా ఫుట్ పాత్ నిర్మిస్తున్నప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆర్అండ్బి అధికారులపై రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్అండ్బి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసారు. నగర పాలక సంస్థ కార్యాలయం నుండి 5 ఇంక్లైన్ వరకు రూ.1.6 కోట్ల వ్యయంతో ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫుట్ పాత్ పనుల్లో నాణ్యత లోపించిందన్న వివిధ వర్గాల నుంచి వస్తున్న ఆరోపణల నేపధ్యంలో ఆయన స్పందించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పనులు పరిశీలించి నాణ్యత లోపం కనిపిస్తే కూల్చి వేయించి పునర్నిర్మాణంచేపిస్తానని అన్నారు. గృహాల యజమానులు తమ వాహనాల రాకపోకల కొరకు ఉపయోగించడం వలన కూలిపోయి ఉంటాయని అధికారులు వివరణ ఇచ్చారు. ఇక ముందు నాణ్యత లోపం తలెత్తకుండా పకడ్బందీగా పనులు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.సదరు కాంట్రాక్టర్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో మేయర్ ఫోన్లో మాట్లాడి నాణ్యత పాటించాలని అదేశించారు.
ఈ సమావేశంలో నగర పాలక సంస్థ ఇఇ మహేందర్, మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఎ ఇ జావీద్, కన్సల్టెంట్ పద్వీ తదితరులు పాల్గొన్నారు.