– పోలీసుల త్యాగాలు అజరామరం
– అమర పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలి
– పెద్దపల్లి డిసిపి రవీందర్
(మేజిక్ రాజా-ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 21: విదేశీ శత్రుమూకల నుంచి దేశాన్ని కాపాడే వారు సైనిక జవానులైతే, అంతర్గత శత్రువుల నుంచి ప్రజలను కాపాడి, భద్రతకు భరోసా ఇచ్చేది, సామాజిక ఆస్తులను సంరక్షించేది, శాంతిభద్రతలను అదుపులో పెట్టేది, నేరగాళ్ళను నియంత్రించేది పోలీసులేనని పెద్దపల్లి డీసీపీ పి.రవీందర్, డీసీపీ అడ్మిన్ ఎన్. అశోక్ కుమార్ పేర్కొన్నారు.
పోలీస్ అమర వీరుల సంస్మరణ దినం(ఫ్లాగ్ డే) పురస్కరించుకుని గురువారం రామగుండం కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటుచేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి పెద్దపల్లి డిసిపి పి.రవీందర్, డిసిపి అడ్మిన్ ఎన్.అశోక్ కుమార్ లు ముఖ్య అతిథిగా హాజరైనారు.
![Police are give security](https://prajalakshyam.com/wp-content/uploads/2021/10/Police-martyrs.jpg)
ముందుగా పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అమరవీరుల స్థూపము వద్ద కాగడాను వెలిగించి, పుష్పగుచ్ఛముంచి నివాళులర్పించారు.
![Police are give security](https://prajalakshyam.com/wp-content/uploads/2021/10/Police-Martyrs-6.jpg)
అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబర్ 21, 1959వ సంవత్సరంలో 20 మంది జవాన్లు లడక్ ప్రాంతంలోని హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తుండగా, చైనా సైనికులు మన భారత జవాన్లపై దాడి చేసి, 10 మందిని హతమార్చారన్నారు. నాటి నుండి దేశ వ్యాప్తంగా, విధి నిర్వహణ లో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ప్రారంభమైందన్నారు.
![Police are give security](https://prajalakshyam.com/wp-content/uploads/2021/10/police-martyrs-2.jpg)
అమరులైన పోలీసుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవకు, ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణకు పునరంకితం కావాలన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, మతతత్వం వంటి విఛ్ఛిన్న కర శక్తులతో నేరాలకు,ఘోరాలకు పాల్పడే అసాంఘిక శక్తులతో అనుక్షణం పోరాడవలసి రావడంతో పోలీసు ఉద్యోగం కత్తిమీద సాములాగ ఎంతో ప్రమాదకరంగా పరిణమించిందన్నారు.
సమయం, ప్రాంతంతో పనిలేకుండా, సంఘటన ఏదైనా, ప్రమాదం జరిగిన ప్రతిచోటా ముందుగా ఉండేది పోలీసేనని, రక్షణ అంటే గుర్తొచ్చేది పోలీసేయని, పోలీసు విధి నిర్వహణ చాలా శ్రమతో కూడుకున్న దన్నారు. ఇతర ఉద్యోగుల్లా కొన్ని గంటలకు మాత్రమే పరిమితం కాకుండా, పండుగలు, పబ్బాలు, సెలవులులేని ఇరవై నాలుగు గంటల ఉద్యోగం ఒక్క పోలీసు ఉద్యోగమేనన్నారు.
![Police are give security](https://prajalakshyam.com/wp-content/uploads/2021/10/police-martyrs-5.jpg)
పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని, ప్రతి ఒక్కరూ ఏ ఆపదకైనా ఆశ్రయించేది పోలీసులనేనని, అన్ని పరిస్థితుల్లో అన్ని వేళల్లో పోలీసులే ముందుంటారన్నారు. సామాన్యుడు మొదలు ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ, ప్రతి అవసరానికీ సాయం కోరేది పోలీసులనేనన్నారు.
అంతర్గత భద్రతను కాపాడే పనిలో పోలీసులు ప్రాణాలు సైతం అర్పిస్తున్నారన్నారు. త్యాగాలకు భయపడకుండా, వెనుకడుగు వేయకుండా, రెట్టించిన సమరోత్సాహంతో, అసాంఘిక శక్తులతో పోరాడి విజయాన్ని సాధించడం జరిగిందన్నారు. పోలీసుల తప్పులు ప్రచారం అవుతున్నంతగా, వారి త్యాగాలు ఆశించిన స్థాయిలో గుర్తింపుకు నోచుకోవడం లేదన్నారు.
![Police are give security](https://prajalakshyam.com/wp-content/uploads/2021/10/police-martyrs-7.jpg)
ఈ సంవత్సరంలో మన దేశంలో విధి నిర్వహణలో 377 మంది పోలీసులు వీరమరణం పొందారని, వారందరికీ శ్రద్దాంజలి ఘటించారు. వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాల సంక్షేమాన్ని, వారికి ఆర్థిక పరమైన ప్రయెజనాలను, మానసిక బలాన్ని అందించడమే పోలీసు అమర వీరులకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు.
![Police are give security](https://prajalakshyam.com/wp-content/uploads/2021/10/police-martyrs-3.jpg)
పోలీసులు చేస్తున్న అత్తున్యత త్యాగాలను సమాజం గుర్తుంచుకొనే విధంగా కమీషనరేట్ లో ఈరోజు నుండి ఈనెల 31 వరకు పోలీసు స్టేషన్లలో ఓపెన్ హౌజ్ కార్యక్రమాలు, కొవ్వొత్తి ర్యాలీలు, నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని, త్యాగమూర్తుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి కుటుంబ సమస్యలను తెలుసుకొని, సాద్యమైనంత త్వరగా పరిష్కరిస్తామన్నారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు.
![police are give security](https://prajalakshyam.com/wp-content/uploads/2021/10/Police-martyrs-4.jpg)
ఇంకా ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్,ఎసిపిలు గిరి ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి నారాయణ, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ కమలాకర్, ఇన్స్పెక్టర్లు,సబ్ఇన్స్పెక్టర్లు .రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్లు, రామగుండము పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అద్యక్షులు బోర్లకుంట పోచలింగం,ఎఒ నాగమణి,ఎఆర్,సివిల్ పోలీసులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.