శివారెడ్డి ఆత్మహత్య కేసులో ఐదుగురి అరెస్టు
– ఏసీపీ ఉమేందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 16: నేరస్తులకు ఆశ్రయం కల్పిస్తే క్రిమినల్ కేసలు తప్పవని గోదావరిఖని ఏసీపీ వి. ఉమేందర్ అన్నారు. జ్యోతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలకుర్తి మండలం గుంటూరుపల్లెకు చెందిన శివారెడ్డి ఆత్మహత్య కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఏసీపీ ఉమేందర్ తెలిపారు. బుధవారం స్టేషన్లో నిందితులను అరెస్టు చూసిన సందర్భంగా కేసు వివరాలను ఏసీపీ తెలిపారు.
గత నెల 26న పాలకుర్తి మండలం గుండూరుపల్లె గ్రామానికి చెందిన ఐదోవార్డు సభ్యురాలు అనూష భర్త శివారెడ్డి (39) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావున మానసాని కృష్ణారెడ్డి, రాజ్కుమార్తో పాటు కొత్తపల్లి శ్రీనివాస్ కారణమంటూ సూసైడ్ వ్రాసాడు. మృతుడి భార్య అనూష ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి మానసాని కృష్ణారెడ్డి, రాజ్కుమార్, కొత్తపల్లి శ్రీనివాస్ వీరికి సహకరించిన పాలడుగు సతీష్, ప్రమోద్రెడ్డిలను అరెస్ట్ చేసినట్టు ఎసీపీ తెలిపారు.
వివరాల్లోకి వెళితే… గుంటూర్పల్లె డీఎంఎఫ్టి నిధులతో నిర్మించిన రోడ్డు నిర్మాణ పనుల్లో తమకు వాటా కావాలని శివారెడ్డిని బ్లాక్మెయిల్ చేసినట్టు తెలిపారు. లేదంటే రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని బెదిరించారు. అప్పటికే శివారెడ్డి మీద రాజకీయ కక్షతో ఉన్న ఎల్కలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ కూడా వారితో పాటు కలిసి శివారెడ్డిని వేధించి హింసించగా ఇది తట్టుకోలేక తన చావుకు వీరు ముగ్గురు కారణమని సూసైడ్ నోట్ రాసి శివారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు ఏసీపీ వివరించారు.
సూసైడ్ నోట్ ఆధారంగా కృష్ణారెడ్డి, శ్రీనివాస్, రాజ్కుమార్లపై ఐసీపీ 306 కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితులుగా వున్న వ్యక్తులు కొద్ది రోజులుగా పరారీలో ఉంటూ హైకోర్టులో ఆంటీసీపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ఈ క్రమంలో పోలీసులు పకడ్బందీ కౌంటర్ ఫైల్ చేయగా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. దీంతో హైకోర్టులో తమ పిటిషన్ను ఉపసంహరించుకొని గోదావరఖని 6వ అడిషనల్ జడ్జి కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఏసీపీ తెలిపారు.
అరెస్టు కోసం శ్రమిస్తున్న ఎన్టీపీసీ పోలీసులకు హైదరాబాదులో నిందితులు వున్నారనే వచ్చిన సమాచారం మేరకు పోలీస్ కమిషనర్ ఆదేశాలతో ఒక ప్రత్యేక బృదాన్ని హైదరాబాద్ పంపి హబ్సిగూడ ప్రాంతంలోని స్నేహనగర్ కాలనీ స్ట్రీట్ నెంబర్ 8లో గల ఒక ఇంటిలో పెంట్ హౌస్ ని రెంట్ కు తీసుకొని అందులో తలదాచుకున్న మానసాని కృష్ణారెడ్డి, కొత్తపల్లి శ్రీనివాస్, సి.హెచ్. రాజ్కుమార్తో పాటు నిందితులకు ఆశ్రయం కల్పించిన ఎంపీటిసీ పాలడుగుల సతీష్, ప్రమోద్రెడ్డిని అరెస్ట్ చేసి ఎన్టీపీసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. వారిని గోదావరిఖని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఏసీపి తెలిపారు. నేరం చేసినవారే కాకుండా వారికి ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా 201, 212 ఐపీసీ సెక్షన్ల కింద కేస్ నమోదు చేసి జైల్ కి పంపిస్తామని ఈ సందర్బంగా ఏసీపీ ఉమేందర్ హెచ్చరించారు.