

ఎట్టకేలకు సింగరేణికే తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్.
కేంద్ర నిర్ణయం ప్రకటించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి.
182 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు.. ఏటా 60 లక్షల టన్నుల ఉత్పత్తి.. 40–50 ఏళ్లపాటు గనుల నిర్వహణ.
సింగరేణికి రూ.2,550 కోట్ల ఆదా.. తెలంగాణకు రూ.16 వేల కోట్ల ఆదాయం.. 1,200 మందికి ఉపాధి అవకాశాలు.
బీఎంఎస్, ఐఎన్టీయూసీ హర్షం.. కేంద్రానికి కృతజ్ఞతలు.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 7: ఎట్టకేలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)కు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కేటాయించింది. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. బొగ్గు బ్లాక్ను బహిరంగ వేలం నిర్వహించకుండా నేరుగా సింగరేణికి కేటాయించినట్లు వెల్లడించారు. అలాగే మణుగూరు పీకే ఓసీ–2 డీప్ స్లైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాల్లోనూ సింగరేణి బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్లో సుమారు 182 మిలియన్ టన్నుల నాణ్యమైన బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ గని ద్వారా ఏటా 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉండగా, 40 నుంచి 50 సంవత్సరాలపాటు ఉత్పత్తి కొనసాగనుంది. బొగ్గు బ్లాక్ను వేలం ద్వారా కాకుండా నేరుగా సింగరేణికి కేటాయించడం వల్ల వేలం ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేక సంస్థకు సుమారు రూ.2,550 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాయల్టీలు, ఇతర పన్నుల రూపంలో తెలంగాణ ప్రభుత్వానికి దాదాపు రూ.16 వేల కోట్ల ఆదాయం సమకూరనుండగా, సుమారు 1,200 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి తెలిపారు.
సింగరేణి అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం:
ఈ సందర్భంగా మంత్రి జి. కిషన్రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల జీవనాడిగా పేరొందిన సింగరేణి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. ప్రస్తుతం సింగరేణిలో 39 గనులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వాటిలో 21 భూగర్భ గనులు, 18 ఓపెన్కాస్ట్ గనులు ఉన్నాయని తెలిపారు. ఆరు నుంచి ఎనిమిది జిల్లాల్లో సింగరేణి కార్యకలాపాలు విస్తరించి లక్షలాది మంది జీవనోపాధికి ఆధారంగా నిలుస్తోందన్నారు. సింగరేణికి సంబంధించిన ప్రధాన మైనింగ్ ప్రాజెక్టులకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల మంజూరులో కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని, వారి సేవలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువలేరని అన్నారు.
నైనీ బొగ్గు బ్లాక్తో రూ.75 వేల కోట్ల ఆదాయ అవకాశం:
ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ను కూడా సింగరేణికి దక్కేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసిందని మంత్రి వెల్లడించారు. ఈ బ్లాక్లో సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉండగా, 30 నుంచి 35 సంవత్సరాలపాటు అవసరాలకు సరిపడే నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఏటా 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ గని ద్వారా సింగరేణికి సుమారు రూ.75 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో జరిగే బొగ్గు గనుల వేలంలోనూ సింగరేణి పాల్గొనేలా కేంద్రం ప్రోత్సహిస్తోందని చెప్పారు.
బీఎంఎస్ కృషి ఫలించిందన్న అప్పాని శ్రీనివాస్:
తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడం పట్ల సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బీఎంఎస్) అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డిని కలిసి తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ను సింగరేణికి కేటాయించాలని వినతిపత్రం సమర్పించామని, ఆ కృషి ఫలించిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సింగరేణి భవిష్యత్తు మరింత బలోపేతం అవుతుందని, కార్మికుల ఉద్యోగ భద్రతకు భరోసా లభిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డికి సింగరేణి కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఐఎన్టీయూసీ స్వాగతం:
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ స్వాగతించారు. తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ సింగరేణికి కేటాయించడం సంస్థ భవిష్యత్తుకు, కార్మికుల ఉద్యోగ భద్రతకు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధికి చొరవ చూపిన కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డికి కార్మికుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సింగరేణికి మరింత బలాన్నిచ్చే నిర్ణయం:
తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ కేటాయింపుతో సింగరేణికి దీర్ఘకాలికంగా బొగ్గు నిల్వలు అందుబాటులోకి రావడంతో పాటు సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. వేలం ప్రీమియం భారం తప్పడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం కలగడంతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం సింగరేణి చరిత్రలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.