– ఇద్దరు నిర్వాహకుల అరెస్ట్
– 58వేల రూపాయల స్వాధీనం
– బ్యాంకు ఖాతాలోని రూ.4,64,000/- సీజ్
– వివరాలు వెల్లడించిన రామగుండం సిపి సత్యనారాయణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 8: మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్ వర్క్ బిజినెస్ (గొలుసు కట్టు వ్యాపారం) ద్వారా అక్రమ దందా చేస్తున్న ఇద్దరు నిర్వాహకులను మంచిర్యాల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసారు. స్థానిక ఎంకన్వెన్షన్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కేంద్రలోని కాలేజీ రోడ్కు చెందిన మామిడి కమలాకర్, కర్నాటక రాష్ట్రం బెంగుళూరు ఆదర్శనగర్కు చెందిన రాజు గోస్వామి జుఐవా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో వ్యాపారాన్ని ప్రారంభించారు. మల్టీ ట్రేడ్ బిజినెస్, సక్సెస్ ట్రేడ్ బిజినెస్, షేర్ మార్కెట్ పేర్లతో ఆన్లైన్ వ్యాపారానికి దిగారు. ఇందులో డబ్బులు డిపాజిట్ చేస్తే 72 శాతానికి పైగా వడ్డీ ఇస్తామని నిర్వాహకులు నమ్మించి డిపాజిట్లు సేకరించారు. ఈ వ్యాపారంలో ఏదో మోసం ఉన్నట్లు గుర్తించిన మందమర్రికి చెందిన గోవిందుల రాజేశం స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. వారు సీపికి తెలయజేయగా ఆయన ఆదేశాల మేరకు రామగుండం టాస్క్ఫోర్స్, మంచిర్యాల పోలీసులు రంగంలోకి దిగి నిందితులను అరెస్టు చేసారు.
పట్టుబడినారిలా…
మంచిర్యాల్ సిఐ లింగయ్య ఆద్వర్యంలో రామగుండం టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ టి.కిరణ్ ఎస్సైలు సి హెచ్ కిరణ్, లచ్చన్న, మంచిర్యాల ఎస్.ఐ. ప్రవీణ్లు ఐబీ చౌరస్తా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించగా అదే సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దురు వ్యక్తులు అనుమానంగా కనిపించారు. వారి కారును ఆపి వివరాలు అడగగా, పొంతనలేని సమా ధానాలతో అనుమానం కలిగిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లు మామిడి కమలాకర్, రాజు గోస్వామిలుగా నిర్ధారణ అయింది. కారులో దొరికిన వ్యాపారానికి సంబంధించిన కర పత్రాలు లబించడంతో వారే జుఐవా మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్ వర్క్ బిజినెస్ పేరిట అక్రమ దందా నిర్వహిస్తున్నారని వెలుగులోకి వచ్చింది. వారి వద్ద నుండి కారు, 58వేల నగదు, ఒక కంప్యూటర్, ప్రింటర్, 4లక్షల రూపాయల విలువగల కంపెనీ పేరుగల వస్తువులు, 50 వేల విలువగల ఆఫీసు ఫర్నీచర్, బ్యాంక్ ఎకౌంట్లో 4,64,000/- నగదు వున్నట్లు గుర్తించి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.

ఇరువురి ప్రస్థానం…
కమలాకర్కు కొంతకాలం క్రితం సోషల్ మీడియా వేదికగా రాజు గోస్వామి పరిచయం అయ్యాడు. వీరిద్దరికీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ నెట్ వర్క్ బిజిస్ (గొలుసు కట్టు వ్యాపారం) ద్వారా మోసం చేస్తూ డబ్బులు సంపాదించడం అలవాటుగా మారింది. ఇందులో భాగంగా ఈజీ భీజ్, జరా హబ్ , హెల్పింగ్ నేచర్, హెల్ప్ ఇండియా, రాయల్ మ్యాజిక్ పూల్, ఏంజిల్స్ హెల్ప్, అస్యూర్ మనీ, బ్యాంక్ ఆఫ్ ట్రొన్, ట్రోన్ 25 , ట్రొన్ 50, కింగ్స్ ఫ్లై హై, గుడ్ క్యాష్, బీజా క్యాష్ లాంటి ఎన్నో మార్కెటింగ్ కంపెనీలలో ఏజెంట్లుగా పనిచేశారు. కమలాకర్ ఇంతకుముందు 2014 లో ఇలాంటి మోసమే చేసి మంచిర్యాల పోలీస్ స్టేషన్ నుండి జైలుకెళ్లి రావడం జరిగింది. అంతేకాకుండా 2016 లో కూడా పంజాబ్ సంబం ధించిన ఒక మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారాన్ని నడిపించి పాయిపోయి ఇక్కడికి చేరుకొని రాజుతో జతకట్టాడు.
మోసం చేసిన విధానం…

వీరివురువు కలిసి ఒక మల్టీలెవెల్ మార్కెటింగ్ నెట్ వర్క్ కంపెనీని రిజిస్ట్రేషన్ చేసుకుని, కొంతకాలం నమ్మకంగా వ్యాపారం చేసి, జనాల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు అయిన తరువాత మోసం చేసి వెళ్ళిపోదాం అనే ప్రణాళిక వేసుకొన్నారు. అందులో భాగంగానే జూలై 25న జుఐవా ఆన్లైన్ మార్కెటింగ్ పేర సంస్థను ఏర్పాటు చేసి, దానికి వీళ్ళిద్దరూ మేనేజింగ్ డైరెక్టర్లుగా ప్రకటించుకుని కంపెనీ పేరుమీద అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. దాని ద్వారా లావాదేవీలు జరపడం మొదలుపెట్టారు.
ఈ కంపెనీలో ఐదు లక్షల రూపాయల డిపాజిట్ చేసిన వారికి 5 లక్షల రూపాయల విలువైన ప్రొడక్ట్స్ ఇస్తామని, వారి ఖాతాలో నెలకు 25 వేల రూపాయల చొప్పున 24 నెలలు నగదు జమ చేయడం జరుగుతందని, 24 నెలల తర్వాత కంపెనీ ఇచ్చిన ప్రొడక్ట్స్ అమ్మినా, అమ్మకపోయినా డిపాజిట్ తిరిగి చెల్లిస్తామని నమ్మబలికారు. ఐదులక్షల స్థానంలో 11 లక్షల రూపాయలను తిరిగి రెండు సంవత్సరాల్లో చెల్లిస్తామని నమ్మించారు.
ఆగస్టు 10న మల్టీ ట్రేడ్ బిజినెన్ ప్రారంభించారు. ఇందులో ఒక లక్ష రూపాయలు జమ చేసిన వారికి రోజుకు మూడు వేల చొప్పున 67 రోజులు ఇస్తామని ఆశ చూపారు. 67 రోజుల్లోనే లక్షకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ చూపారు.
సెప్టెంబర్ 30న సక్సెస్ ట్రేడ్ బిజినెస్ ప్రారంభించారు. ఇందులో లక్ష రూపాయలు డిపాజిట్ చేసిన వారికి రోజుకు వెయ్యి రూపాయల చొప్పున 300 రోజులు మొత్తం 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి నమ్మించారు.

వీరి మాటలు నిమ్మన వివిధ జిల్లాలకు చెందిన సుమారు 110 సంభ్యులుగా చేరారు. వారికి జుఐవా కంపెనీ పేరుతో తయారు చేసిన హోంప్రొడక్ట్స్ ఇచ్చారు. అయితే అవన్నీ నకిలీవేని పోలీసులు నిర్ధారించారు. కొన్ని వస్తువులకు బ్రాండెడ్ పేరు పెట్టడం గమనార్హం. వీరి చేతిలో మోస పోయినవ వారిలో ఎక్కువగా బెంగళూరు, మహారాష్ట్ర, ఒడిశా, విశాఖపట్నం, కడప, అంతనంపూర్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, మందమర్రి, మంచిర్యాల వారు అధికంగా ఉన్నారని సీపీ సత్యనారాయణ తెలిపారు.
జుఐవా కంపెనీ పేరుతో విక్రయిస్తున్న ఉత్పత్తులపై కొనేవారికే కాదు, అమ్మేవారికి కూడా సరైన అవగాహన లేదని. ఈ ఉత్ప త్తులలో ఎలాంటి ధృవీకరణ, చట్టబద్ధత, శాస్త్రీయత లేనివని పోలీసుల విచారణలో వెల్లడైందని తెలిపారు. తక్కువ ధరకు నాసిరకమైన వస్తువులు కొని, వాటికి కంపనీ స్టిక్కర్ అంటించి అధిక ధరలు వేసి ప్రజలను మోసం చేస్తూ వాటి విలువ 5లక్షల విలువ అని చెప్పి ప్రజలకు అంటకట్టారన్నారు. వీరి లక్ష్యం ఒక సంవత్సర కాలంలో 10 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసి పారిపోవడమేనని సీపీ తెలిపారు.