ఆర్డీఓ, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

కామారెడ్డి జిల్లా , సెప్టెంబర్ 03 ( లోకంతీరు ) : అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ కలెక్టర్ కార్యాలయం నుండి డివిజన్ మరియు మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధిక వర్షాల ప్రభావం ఇంకా ముగిసి పోనందున అధికారులు అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణా, ఆస్తి నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధిక వర్షాలతో చెడిపోయిన రహదారులను సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. అధిక వర్షాల వలన చనిపోయిన వారి వివరాలు, దెబ్బతిన్న ఇండ్ల వివరాలను అందించాలని రెవెన్యూ శాఖ అధికారులు ఆదేశించారు. అధిక వర్షాల వలన పాఠశాల భవనాలు దెబ్బతిని ఇబ్బందిగా మారిన పాఠశాలల వివరాలను అందించాలని, అవసరం అనుకుంటే పాఠశాలను సరి చేసేవరకు సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. వంగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులు ఆదేశించారు. వ్యాధుల ప్రబలకుండా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలు పగడ్బందీగా నిర్వహించాలన్నారు. వైద్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.