బిజెపి ఎండోమెంట్ సెల్ కో-కన్వీనర్గా ఏర్పుల రాజు-జయ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, ఆగస్టు 9: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పోచారం డివిజన్ భారతీయ జనతా పార్టీ ఎండోమెంట్ సెల్ (ధార్మిక విభాగం) నూతన కార్యవర్గాన్ని పార్టీ నాయకత్వం ప్రకటించింది. ఎండోమెంట్ సెల్ పోచారం డివిజన్ కన్వీనర్గా నీలం సత్యం గౌడ్, కో-కన్వీనర్గా ఏర్పుల రాజు జయ నియమితులయ్యారు. తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ రాష్ట్ర, జిల్లా, డివిజన్ నాయకత్వానికి నూతన కన్వీనర్, కో-కన్వీనర్ కృతజ్ఞతలు తెలిపారు. తమ నియామకానికి సహకరించిన ఎండోమెంట్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అన్నావజ్జుల సూర్యప్రకాష్, కో-కన్వీనర్ నిరంజన్ దేశాయ్, మేడ్చల్ జిల్లా కన్వీనర్ అధిమూలం కరుణాకర్, జిల్లా కో-కన్వీనర్లు, పోచారం డివిజన్ పార్టీ అధ్యక్షుడు నానావత్ సురేష్ నాయక్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ నాయకత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పెద్దల మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. పార్టీ పట్ల, నాయకత్వం పట్ల విధేయతతో ఉంటూ ఎండోమెంట్ సెల్ ద్వారా ధార్మిక కార్యక్రమాలను విస్తృతం చేయడంతో పాటు పార్టీ బలోపేతానికి తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. హైందవ ధర్మ పరిరక్షణ, ఆలయాలు, ధార్మిక సంస్థలకు సంబంధించిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. నీలం సత్యం గౌడ్, ఏర్పుల రాజు జయల నియామకంపై పోచారం డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి అభినందనలు తెలిపి, వారి ఆధ్వర్యంలో ఎండోమెంట్ సెల్ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.