
అవయవ, శరీర దానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం సమాజ బాధ్యత.
ఐ ఆర్గాన్, బాడీ డొనేషన్ అవేర్నెస్ జిల్లా చైర్మన్ దేవునూరి చంద్రమౌళి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కాటారం, ఆగస్టు 8: అవయవ, శరీర దానంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ అవేర్నెస్ జిల్లా చైర్మన్ దేవునూరి చంద్రమౌళి అన్నారు. జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ఆదర్శ పాఠశాలలో ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ అవేర్నెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవయవ, శరీర దానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవునూరి చంద్రమౌళి మాట్లాడుతూ.. మరణానంతరం చేసే అవయవ దానం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. శరీర దానం వైద్య విద్యార్థుల అధ్యయనం, పరిశోధనలు, వైద్య రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని వివరించారు. అవయవ, శరీర దానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, శాస్త్రీయ అవగాహనతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే సేవాభావం, మానవత్వం, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. అవయవ, శరీర దానంపై తాము తెలుసుకున్న విషయాలను కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు వివరించి సమాజంలో అవగాహన పెంపొందించాలని కోరారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంచడంతో పాటు, సేవా దృక్పథాన్ని అభివృద్ధి చేస్తాయని అన్నారు. కాటారం మండలంలో భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
శరీరదానానికి అంగీకరించిన వారికి సన్మానం:
ఈ సందర్భంగా శరీరదానానికి స్వచ్ఛందంగా అంగీకారం తెలిపిన జనగామ కరుణాకర్ రావు, ఎలుబాక సుజాతలను ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ అవేర్నెస్ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించి, అభినందన పత్రాలు అందజేశారు. వారి సేవాభావాన్ని అభినందిస్తూ, మరింత మంది శరీరదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు పంతకాని సమ్మయ్య ఆధ్వర్యంలో ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ అవేర్నెస్ జిల్లా చైర్మన్ దేవునూరి చంద్రమౌళి, జిల్లా అధ్యక్షుడు బందెల భూమయ్య, కాటారం మండల అధ్యక్షుడు ఆత్మకూరి కుమార్లను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ పంతకాని తీర్మాల సమ్మయ్య, ఆదర్శ విద్యాసంస్థల చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్నారెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎలుబాక సుజాత, కోడిపల్లి రాము, లక్ష్మణ్, రాకేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.