ఈవీఎం ల ఎఫ్.ఎల్.సి ప్రక్రియను పర్యవేక్షించిన కలెక్టర్

నిజామాబాద్, ఫిబ్రవరి 05 ( లోకం తీరు న్యూస్ ) : : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ సీల్ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరును ప్రాథమికంగా పరిశీలన (ఎఫ్.ఎల్.సి) జరిపేందుకు ఈ.సీ.ఐ.ఎల్ కు చెందిన 17 మంది సాంకేతిక నిపుణుల బృందం జిల్లాకు చేరుకుంది. ఈ బృందం దాదాపు పది రోజుల పాటు ఇక్కడే ఉండి ఈ.వీ.ఎం ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ ను తెరిపించారు. స్థానికంగా గల 2916 బ్యాలెట్ యూనిట్లు, 1752 కంట్రోల్ యూనిట్లు, 2373 వీ.వీ.ప్యాట్ లను నిపుణుల బృందం పరిశీలిస్తుందని ఎన్నికల విభాగం అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ, నిబంధనలు తు.చ తప్పకుండా పాటించాలన్నారు.
ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్, వినోద్ కుమార్, భుజంగరావు, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్, సంతోష్, విజయేందర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.