Take a fresh look at your lifestyle.

సింగరేణి అధికారులకు పీఆర్పీ, పే అప్‌గ్రేడ్ వెంటనే అమలు చేయాలి.. లేకుంటే ప్రత్యక్ష పోరాటం:బిజెపి-బిఎంఎస్.

0 36

పీఆర్పీ, పే అప్‌గ్రేడ్ వెంటనే అమలు చేయాలి.. లేకుంటే ప్రత్యక్ష పోరాటం.

సీఎంఓఏఐ రిలే నిరాహార దీక్షలకు బీజేపీ–బీఎంఎస్ సంఘీభావం.

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 8:

సింగరేణి అధికారులకు పనితీరు ఆధారిత వేతన ప్రోత్సాహకం (పీఆర్పీ) బకాయిలు వెంటనే చెల్లించి, చట్టబద్ధంగా అమలు చేయాల్సిన పే అప్‌గ్రేడ్‌ను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి డా. చందుపట్ల కీర్తిరెడ్డి హెచ్చరించారు. భూపాలపల్లి ఏరియాలో కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (సీఎంఓఏఐ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షలు బుధవారం పదవ  రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన డా. చందుపట్ల కీర్తిరెడ్డి, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ఎస్‌సీఎంకేఎస్–బీఎంఎస్) అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ అధికారుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా డా. కీర్తిరెడ్డి మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి రావాల్సిన పీఆర్పీని నిలిపివేయడం, పే అప్‌గ్రేడ్‌ను అమలు చేయకపోవడం పూర్తిగా అన్యాయమన్నారు. అధికారుల సమస్యలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బీజేపీ కోల్‌బెల్ట్ నియోజకవర్గ సభ్యులు, సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) జాతీయ కోల్ సెక్టార్ ఇన్‌చార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు అధికారుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు ప్రకటించాయని, అవసరమైతే ప్రత్యక్ష ఉద్యమాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల సీఎండీ, డైరెక్టర్లతో జరిగిన సమావేశంలో పీఆర్పీ అంశంపై విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయం తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. పీఆర్పీ చెల్లింపునకు ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా అడ్డంకులు లేవని, అయినప్పటికీ జాప్యం చేయడం అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందన్నారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం వెంటనే పీఆర్పీ బకాయిలు విడుదల చేసి, పే అప్‌గ్రేడ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సింగరేణి వ్యాప్తంగా అసంతృప్తి మరింత పెరిగి, ఉత్పత్తి, పారిశ్రామిక శాంతికి అంతరాయం కలిగే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులకు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అధికారుల న్యాయమైన పోరాటానికి బీజేపీ, బీఎంఎస్ పూర్తి మద్దతుగా నిలుస్తాయని, అవసరమైతే మరింత ఉధృతమైన ప్రజాస్వామ్య ఉద్యమాల్లోనూ పాల్గొంటామని డా. చందుపట్ల కీర్తిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిశితన్ రెడ్డి, వెలబోయిన సుజేందర్, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పని రమేష్, ఎం.డి. యూసుఫ్, కొత్తూరి మల్లేష్, శ్రీనివాస్, పునీత్‌రావు, రాజు, దొంగల రాజేందర్, బట్టు రవి, సంపత్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.