జెఎంఈటీలకు ఓవర్మెన్ పదోన్నతులు కల్పించాలి.
కొత్తగూడెం రిలే నిరాహార దీక్షలకు భూపాలపల్లి మైనింగ్ సిబ్బంది సంఘీభావం.
నల్ల బ్యాడ్జీలతో నిరసన.. యాజమాన్యం వెంటనే స్పందించాలని డిమాండ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 7: సింగరేణి సంస్థలో 2016, 2017 సంవత్సరాల్లో జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీలుగా (జెఎంఈటీ) చేరిన ఉద్యోగులకు ఓవర్మెన్ పదోన్నతులు వెంటనే కల్పించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు భూపాలపల్లి ఏరియా మైనింగ్ సిబ్బంది సంఘీభావం ప్రకటించారు. జెఎంఈటీల న్యాయమైన డిమాండ్లకు పూర్తి మద్దతు తెలుపుతూ శుక్రవారం కేటీకే-1 ఇంక్లైన్లో మైనింగ్ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, జెఎంఈటీలకు పదోన్నతులు కల్పించడంలో యాజమాన్యం జాప్యం చేయడం వల్ల ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధికి కీలకంగా సేవలందిస్తున్న మైనింగ్ సిబ్బంది సమస్యలను కూడా యాజమాన్యం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు.
జెఎంఈటీల ఉద్యమానికి మద్దతు ప్రకటించిన వారిలో ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ భూపాలపల్లి ఏరియా మైనింగ్ సిబ్బంది ఇన్చార్జి గడిపే చక్రపాణి, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రఘుపతి రెడ్డి, కేటీకే-1 ఇంక్లైన్ మెయిన్ ఇన్చార్జి షేక్ హుస్సేన్, రిలే-బి ఇన్చార్జి శ్రీనివాస్, మైనింగ్ సిబ్బంది ఆర్.వి.రావు, దిలీప్, రమేష్, మహేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.