Take a fresh look at your lifestyle.

సింగరేణి ఆర్జీవన్ ఏరియాలో సిఎండి విస్తృత పర్యటన.

0 44


(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, మే 29:
సింగరేణి సీ,ఎండి డా.బుద్ధప్రకాశ్ జ్యోతి శుక్రవారం ఆర్జీ-1 ఏరియాలో విస్తృతంగా పర్యటించి గనుల ఉత్పత్తి, కార్మిక సంక్షేమం, భద్రతా చర్యలు, కంపెనీ సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. పర్యటనలో భాగంగా జీడీకే-11 ఇంక్లైన్ గనిలో ఉద్యోగులు, అధికారులు, కార్మికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి సంస్థ అభివృద్ధికి సూచనలు కోరారు. బొగ్గు ఉత్పత్తి పెంపు, ఉత్పాదకత, నాణ్యత మెరుగుదల, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. సింగరేణి సంస్థకు ఉన్న అనుభవం, క్రమశిక్షణ, సమిష్టి పనితత్వం సంస్థ ప్రత్యేకత అని పేర్కొంటూ, ఉత్పత్తితో పాటు కార్మిక సంక్షేమం, భద్రతకు సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గనిలో ఏర్పాటు చేసిన 5వ మాన్ రైడింగ్ సిస్టమ్ ను ప్రారంభించారు. ఈ సిస్టమ్ ద్వారా భూగర్భ గనుల్లో పని ప్రాంతాలకు కార్మికులు సురక్షితంగా, వేగంగా చేరుకునే అవకాశం కలుగుతుందని, శారీరక శ్రమ తగ్గుతుందని తెలిపారు. మాన్ రైడింగ్ సిస్టమ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను అభినందించి సన్మానించారు. డైరెక్టర్ ఎల్.వి.సూర్యనారాయణ మాట్లాడుతూ జీడీకే-11 గని సింగరేణిలో అత్యధిక యాంత్రీకరణ, అధిక ఉత్పాదకత కలిగిన రెండవ అతిపెద్ద గని అని తెలిపారు. ఆధునిక యంత్రాలను సమర్థంగా వినియోగించి వ్యయాన్ని తగ్గిస్తూ ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని సూచించారు. డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సంస్థను నష్టరహిత స్థాయికి తీసుకెళ్లి లాభాలతో ముందుకు నడిపించాలని, ప్రస్తుతం ఉన్న ఒక మిలియన్ టన్నుల ఉత్పత్తిని భవిష్యత్తులో 1.5 మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని సూచించారు. తదుపరి జీడీకే-5 ఓపెన్‌కాస్ట్ గనిని సందర్శించిన సీఎండీ బొగ్గు, ఓవర్‌బర్డెన్ ఉత్పత్తి, రవాణా, యంత్రాల వినియోగంపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియాన్ని సందర్శించి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం కల్పిస్తున్న క్రీడా, వినోద సదుపాయాలను పరిశీలించారు. తరువాత ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయంలో అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో సమావేశం నిర్వహించి బొగ్గు ఉత్పత్తి, భద్రతా ప్రమాణాలు, నాణ్యత, వ్యయ నియంత్రణ, భవిష్యత్ లక్ష్యాలపై సమీక్షించారు. అన్ని ఏరియాలు సమన్వయంతో పనిచేసి ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎం.తిరుమలరావు, ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, ఎడిషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బి.వెంకన్న, ఆర్జీ-1 ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్ కుమార్, ఆర్జీ-3 జనరల్ మేనేజర్ మధుసూదన్, ఆర్జీ-2 ఇన్‌చార్జి జనరల్ మేనేజర్ మాలోత్ రాముడు, జీఎం (సీడీఎన్), మార్కెటింగ్ టి.శ్రీనివాస్, జీడీకే-11 ఏజెంట్,ఏజీఎం చిల్క శ్రీనివాస్, మేనేజర్ బి.మల్లేశం, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, బ్రాంచ్ సెక్రటరీ రంగు శ్రీనివాస్, ఎస్ఓ టూ జీఎం చంద్రశేఖర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ రమేష్, మేనేజర్ అనిల్ గబాలే, అధికారులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.