భద్రాద్రి జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా అనూష.
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, సెప్టెంబర్ 8: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా టూరిజం నోడల్ అధికారిణిగా జిల్లా పంచాయతీ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న గ్రూప్-1 అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా భద్రాద్రి జిల్లాలో పర్యాటక అభివృద్ధికి అనూషను నోడల్ అధికారిణిగా నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను గుర్తించి, వాటి అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికల రూపంలో సమర్పిస్తూ నోడల్ అధికారిణి కీలకంగా పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా పర్యాటక అధికారిగా విధులు నిర్వహిస్తున్న పరాధామరెడ్డి ఇకపై జిల్లా యువజన, క్రీడల అధికారిగా కొనసాగనున్నారు.