
తుమ్మల చెరువు వద్ద డిడిఆర్ఎఫ్ శిక్షణ శిబిరాన్ని పరిశీలించిన డీఎస్పీ రవీందర్ రెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 23:విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డిడిఆర్ఎఫ్) సిబ్బంది కీలక పాత్ర పోషిస్తారని మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి అన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం తుమ్మల చెరువు వద్ద నిర్వహిస్తున్న డిడిఆర్ఎఫ్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన సోమవారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణా శిబిరంలో జరుగుతున్న కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన డీఎస్పీ, సిబ్బందికి అందిస్తున్న శిక్షణ విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి సహాయక చర్యలు చేపట్టేందుకు డిడిఆర్ఎఫ్ బృందాలు ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. సిబ్బంది నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు శిక్షణలో క్రమశిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సమయంలో సమర్థవంతమైన సేవలు అందించడమే శిక్షణ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం సీఐ ఎల్లయ్య, పోలీసు అధికారులు, డిడిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.