సింగరేణిలో 10 మంది ఫైనాన్స్ అధికారులకు బదిలీలు, పోస్టింగ్లు.
తక్షణమే అమల్లోకి.. పలు కీలక విభాగాల్లో బాధ్యతల మార్పు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కొత్తగూడెం, ఆగస్టు 30: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ఫైనాన్స్ విభాగానికి చెందిన 10 మంది అధికారులకు బదిలీలు, పోస్టింగ్లు కల్పిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిష్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఆగస్టు 30న జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వుల ప్రకారం ఈ మార్పులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. ఆదేశాల ప్రకారం సీహెచ్ మురళీధర్ (జీఎం–ఎఫ్అండ్ఏ)ను జీఎం (ఎఫ్అండ్ఏ), అంతర్గత ఆడిట్ నుండి జిఎం (ఎఫ్అండ్ఏ) కార్పొరేట్ గా నియమించారు. ఎరుకలి బీభత్స (ఏజీఎం–ఎఫ్అండ్ఏ)ను కొత్తగూడెం ఏరియా ఎఫ్అండ్ఏ నుంచి సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో జీఎం (ఎఫ్అండ్ఏ)గా పోస్టింగ్ ఇచ్చారు. గండి కొమరయ్య (ఏజీఎం–ఎఫ్అండ్ఏ)ను డైరెక్టర్ (ఫైనాన్స్)కు ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న స్థానం నుంచి హైదరాబాద్లోని జీఎం (ఎఫ్అండ్ఏ) ఫండ్స్ విభాగానికి బదిలీ చేశారు. కొదూరు కవిత (ఏజీఎం–ఎఫ్అండ్ఏ)ను హైదరాబాద్ ఎఫ్అండ్ఏ కార్యాలయం నుంచి కార్పొరేట్ కార్యాలయంలో అంతర్గత ఆడిట్ విభాగాధిపతిగా నియమించారు. పిన్నింటి సుమలత (ఏజీఎం–ఎఫ్అండ్ఏ)ను శ్రీరాంపూర్ ఏరియా ఎఫ్అండ్ఏ నుంచి కార్పొరేట్ కార్యాలయంలో ఏజీఎం (ఎఫ్అండ్ఏ)గా బదిలీ చేశారు. శ్రీధర్ బగలూరి (ఏజీఎం–ఎఫ్అండ్ఏ)ను సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఎఫ్అండ్ఏ నుంచి శ్రీరాంపూర్ ఏరియా ఎఫ్అండ్ఏకు బదిలీ చేశారు.
అలాగే సుధీర్ ఇడుపులపాటి (డీజీఎం–ఎఫ్అండ్ఏ)ను కొత్తగూడెం రీజియన్ అంతర్గత ఆడిట్ విభాగం నుంచి కొత్తగూడెం ఏరియా ఎఫ్అండ్ఏకు, ఎం. దామోదర్రావు (డీజీఎం–ఎఫ్అండ్ఏ)ను బెల్లంపల్లి రీజియన్ అంతర్గత ఆడిట్, శ్రీరాంపూర్ ఏరియా నుంచి కార్పొరేట్ పర్చేస్ విభాగానికి బదిలీ చేశారు.కె. మధుబాబు (డీజీఎం–ఎఫ్అండ్ఏ)ను మందమర్రి, హైదరాబాద్ పర్చేస్, కార్పొరేట్ విభాగాల నుంచి బెల్లంపల్లి రీజియన్ అంతర్గత ఆడిట్, శ్రీరాంపూర్ ఏరియాకు బదిలీ చేశారు. సీలం మోహన్రెడ్డి (డీజీఎం–ఎఫ్అండ్ఏ)ను కార్పొరేట్ పర్చేస్ డిపార్ట్మెంట్ ముంది కొత్తగూడెం రీజియన్ అంతర్గత ఆడిట్ విభాగాధిపతిగా పోస్టింగ్ ఇచ్చారు. బదిలీల కారణంగా సంబంధిత అధికారుల వేతనం, గ్రేడ్లలో ఎలాంటి మార్పు ఉండదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. క్రమ సంఖ్య ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్న అధికారులు బదిలీ ప్రదేశాల్లో వెంటనే బాధ్యతలు స్వీకరించేందుకు ప్రస్తుత విధుల నుంచి విడుదల కావాలని ఆదేశించారు. మిగిలిన అధికారులు సెప్టెంబర్ 5, 2026లోగా ప్రస్తుత పని ప్రదేశాల నుంచి విడుదల కావాల్సి ఉంటుంది.
పాత బదిలీ ఉత్తర్వులు రద్దు:
2025 నవంబర్ 25న జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా విజిలెన్స్ విభాగం నుంచి అంతర్గత ఆడిట్ విభాగం, ఆర్జీ రీజియన్కు బదిలీ అయిన ఫైనాన్స్ మేనేజర్ పెండ్యాల ఓదేలు, అలాగే అంతర్గత ఆడిట్ విభాగం, ఆర్జీ రీజియన్ నుంచి విజిలెన్స్ విభాగానికి బదిలీ అయిన ఫైనాన్స్ మేనేజర్ పాకాల మోహన్రావు బదిలీ ఉత్తర్వులను రద్దు చేసినట్లు తాజా కార్యాలయ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా గండి కొమరయ్యకు కేటాయించిన జీఎం (ఎఫ్అండ్ఏ) హోదా వ్యక్తిగత హోదాగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఆగస్టు 31న కంపెనీ సేవల నుంచి పదవీ విరమణ చేయనున్న ఎన్. చక్రవర్తి, జీఎం (ఎఫ్అండ్ఏ) నుంచి సీహెచ్ మురళీధర్ జీఎం (ఎఫ్అండ్ఏ), అంతర్గత ఆడిట్ విభాగం బాధ్యతలను స్వీకరించనున్నారు. కాగా, కొదూరు కవిత అంతర్గత ఆడిట్ విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జనరల్ మేనేజర్లతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ బదిలీలు, పోస్టింగ్లు సక్షమ అధికారి ఆమోదంతో జారీ చేసినట్లు సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.