Take a fresh look at your lifestyle.

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి…..

0 1,218

మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలి

– కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలి.
– TUCI డిమాండ్

నిజామాబాద్, నవంబర్ 05 ( లోకంతీరు ) : మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలని, కార్మికులపై అధికారుల వేధింపులను అరికట్టాలని మరియు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, మున్సిపల్ కమీషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం. సుధాకర్ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో 13 కార్పొరేషన్లలో 128 మున్సిపాలిటీలలో సుమారు 60 వేల మంది కార్మికులు శానిటేషన్ మరియు ఇతర పనులు చేస్తున్నారన్నారు. వారికి పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు నెలకు 21000/-, ఇతర అలివేన్సులు 05 వేలు మొత్తం కలిపి 26,000/- చెల్లిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ జీహెచ్ఎంసీలో నెలకు 19వేలు ఇస్తూ, రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలలో కేవలం 15,600/- మాత్రమే చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులను సత్కరిస్తూ, శాలువాలు కప్పి పొగడ్తల్లో ముంచెత్తారే తప్ప, జీతాలు పెంచలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులకు నెలకు 26 వేల రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికులపై అధికారులు తరచూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల దగ్గర వసూళ్లకు పాల్పడుతూ ఉండడం సిగ్గుచేటన్నారు. కార్మికులపై అధికారుల వేధింపులను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ ఉద్యోగులకు ఇస్తున్న యూనిఫామ్, బట్టలు చెప్పులు, నూనెలు ఇతర రక్షణ పరికరాలు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు కూడా అందివాలన్నారు.కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, ఎన్.ఎం.ఆర్ కార్మికులకు పేస్కేల్ అమలు చేయాలని, ఇందిరమ్మ, రాజీవ్ గృహకల్ప ఇళ్ల కేటాయింపులో మున్సిపల్ కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.పై డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కే. శివకుమార్, నాగరాజు, శంకరయ్య, కిరణ్, గంగాధర్, శాంతి కుమార్, సైదులు, లక్ష్మి, రజిని, రవికుమార్, నరేష్ నవీన్, వెంకటి లక్ష్మీ సుశీల మమత, రమేష్, ప్రశాంత్, లక్ష్మి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.