సింగరేణి కార్మిక నాయకుడు తిమ్మిరి నరేంద్రబాబు అకాల మృతి.
బీజేపీ సీనియర్ నాయకుడి మృతికి నేతల సంతాపం.. నేడు అంత్యక్రియలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, ఆగస్టు 15: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, సింగరేణి కార్మిక నాయకుడు, న్యాయవాది తిమ్మిరి నరేంద్రబాబు (67) శనివారం మధ్యాహ్నం హైదరాబాద్లో అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో బీజేపీ బలోపేతానికి, పార్టీ అభివృద్ధికి నరేంద్రబాబు చేసిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ కార్యకర్తలకు అండగా నిలిచారని, పార్టీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన మృతి పార్టీకి, కార్యకర్తలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రబాబు పార్థివదేహం శనివారం రాత్రి 10 గంటలకు పాత కొత్తగూడెంలోని ఆయన స్వగృహానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు ఆదివారం ఉదయం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నరేంద్రబాబు స్వగృహానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులర్పించాలని బీజేపీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ జాటోత్ వెంకన్న నాయక్ కోరారు. నరేంద్రబాబు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.