
మూడో రోజు ఆకట్టుకున్న ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటిక
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 16:భూపాలపల్లి ఏరియాలోని కృష్ణ కాలనీ సీఈఆర్ క్లబ్ మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న సామాజిక చైతన్య నాటకోత్సవాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నాటకోత్సవాల్లో భాగంగా మూడో రోజు హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన ‘బుద్ధునితో నా ప్రయాణం’ నాటిక ఆలోచింపజేసే సందేశాలతో ప్రేక్షకులను అలరించింది. కార్యక్రమానికి భూపాలపల్లి ఏరియా ఎస్ఓటు జీఎం డి. శ్యాంసుందర్ ముఖ్య అతిథిగా హాజరై గౌతమ బుద్ధుడు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాటిక ప్రదర్శనను ప్రారంభించారు.గౌతమ బుద్ధుని జీవితం, బోధనలు, మానవతా విలువలు, అహింస, శాంతి, కరుణ, సమానత్వం, సత్యం, ఆత్మపరిశీలన వంటి అంశాలను కళాకారులు హృద్యంగా ఆవిష్కరించారు. రాజభోగాలను త్యజించి మానవాళి బాధలకు పరిష్కారం కోసం సత్యాన్వేషణలో పయనించిన బుద్ధుని జీవిత ప్రయాణాన్ని నాటిక రూపంలో ప్రభావవంతంగా ప్రదర్శించారు. నాటికలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేయగా, కోపం, ద్వేషం, హింసకు దూరంగా ఉండి ప్రేమ, కరుణ, శాంతి మార్గంలో పయనించాలన్న బుద్ధుని సందేశం విశేషంగా ఆకట్టుకుంది. సమాజంలో శాంతి, సహనం, మానవత్వం, సమానత్వాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని నాటిక చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి అధికార ప్రతినిధి విశ్రాంత్ కుమార్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి. మధుకర్ రెడ్డి, భూపాలపల్లి సీఎంఓఏఐ అధ్యక్షులు ఎండీ నజీర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ లైజన్ అధికారులు, వివిధ సంఘాల అధ్యక్షులు, యూనియన్ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, సేవా సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.