గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా భద్రతా తనిఖీలు చేయించుకోవాలి.
సింగరేణి పర్సనల్ మేనేజర్ శ్యామ్సుందర్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 31:వంట గ్యాస్ ప్రమాదాలను నివారించడంతో పాటు వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వంట గ్యాస్ కనెక్షన్లకు సంబంధించిన తప్పనిసరి భద్రతా తనిఖీలు చేయించుకోవాలని సింగరేణి భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్సుందర్ సూచించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ పంపిణీ సంస్థ సిబ్బంది వినియోగదారుల ఇళ్లకు నేరుగా వచ్చి గ్యాస్ కనెక్షన్, రెగ్యులేటర్, స్టవ్, భద్రతా ట్యూబ్లను పరిశీలించి తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. వినియోగదారులు తనిఖీ సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. గ్యాస్ సురక్ష ట్యూబ్ కాలపరిమితి ముగిసినట్లయితే వెంటనే కొత్తది అమర్చుకోవాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తగా భద్రతా ఫైర్ బాల్స్, ఆప్రాన్ తదితర పరికరాలను వినియోగించాలని తెలిపారు. గ్యాస్ కనెక్షన్ కలిగిన వినియోగదారు మరణించిన సందర్భంలో కనెక్షన్ను వెంటనే కుటుంబ సభ్యుల పేరుపై బదిలీ చేయించుకోవాలని సూచించారు. లేనిపక్షంలో భవిష్యత్తులో సిలిండర్ బుకింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతి గ్యాస్ వినియోగదారుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని శ్యామ్సుందర్ తెలిపారు. గ్యాస్ భద్రతా నిబంధనలు పాటిస్తూ భద్రతా తనిఖీలు, ఈ-కేవైసీ ప్రక్రియలను సకాలంలో పూర్తి చేసి సంబంధిత సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.