జీడీకే-11ఏ గనిలో రూఫ్ఫాల్ : తప్పిన ప్రమాదం
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, ఆగస్టు 31: సింగరేణి ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే-11ఏ గనిలో ఆదివారం రాత్రి బొగ్గు రూఫ్ఫాల్ సంఘటన చోటుచేసుకుంది. రెండో షిఫ్ట్లో రాత్రి 7 గంటల సమయంలో కంటిన్యూయస్ మైనర్-1 ప్యానల్లో కంటిన్యూయస్ మైనర్ పనిచేస్తున్న ప్రాంతంలో బొగ్గు పైకప్పు కూలింది. అయితే సంఘటన జరిగిన ప్రాంతంలో కార్మికులు, ఇతర వ్యక్తులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. గనిలో కంటిన్యూయస్ మైనర్ను ఆపరేటర్ సురక్షిత ప్రాంతంలో ఉండి రిమోట్ కంట్రోల్ ద్వారా నిర్వహిస్తున్నట్లు రామగుండం ఏరియా అధికార ప్రతినిధి తెలిపారు. సపోర్టులు లేని గోఫ్ ప్రాంతంలో కంటిన్యూయస్ మైనర్ పనిచేస్తున్న సమయంలో గోఫ్లో ఏర్పడే భౌగోళిక ఒత్తిడి కారణంగా బొగ్గు రూఫ్ అప్పుడప్పుడు సహజంగా కూలిపోయే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా ఈ సంఘటన జరిగినట్లు వివరించారు. భద్రతా చర్యల్లో భాగంగా రాత్రి 11 గంటల సమయంలో కంటిన్యూయస్ మైనర్ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, గనిలో బొగ్గు ఉత్పత్తి యథావిధిగా కొనసాగుతున్నదని ఆయన వెల్లడించారు.