తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా గాజుల చందర్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 5: తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా జయశంకర్-భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గాజుల చందర్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెల్మకంటి దయాకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో నూతన రాష్ట్ర కమిటీని అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు గాజుల చందర్ హర్షం వ్యక్తం చేశారు. తనపై విశ్వాసంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పోతరాజు లాలయ్య, జన్ను నరసయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వెల్మకంటి దయాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ తూముల సదానందంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేయడంతో పాటు జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో సంఘం కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు పలు డిమాండ్లను ఆయన ఉంచారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కొనసాగుతున్న బెల్ట్షాపులను నియంత్రించాలని, ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు. ధనవంతుల ఆక్రమణల్లో ఉన్న అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన వారికి తిరిగి అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్య సదుపాయాలను విస్తృతంగా అందించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంక్షేమ పథకాలు అర్హులకే అందేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.