టేకులపల్లిలో అక్రమ బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలి
బార్ షాపుల నుంచి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు.. కలెక్టర్కు వినతిపత్రం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
టేకులపల్లి, సెప్టెంబర్ 7: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ నంగారా బైరి లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసినట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సంస్థ జిల్లా అధ్యక్షుడు భూక్య మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ.. మండలంలోని బార్ షాపుల యాజమాన్యాలు అధిక ధరలకు మద్యం విక్రయించడంతో పాటు బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, సాధారణ ప్రజలు సంచరించే ప్రాంతాలకు సమీపంలో బెల్టు షాపులు నిర్వహించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అక్రమ బెల్టు షాపుల కారణంగా యువత మద్యానికి బానిసయ్యే ప్రమాదం ఉందని, విద్యార్థుల చదువులు, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఎక్సైజ్ శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని మంగీలాల్ నాయక్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారితో పాటు వాటికి మద్యం సరఫరా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. సంబంధిత శాఖ అధికారులు మండలంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు.