గ్రామాభివృద్ధి కమిటీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదు…

నిజామాబాద్ , ఫిబ్రవరి 24 ( లోకంతీరు ) : అభివృద్ధి కమిటీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్ పర్సన్ కుంచాల సునీత సూచించడం జరిగింది. జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వీడీసీలతో శనివారం నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించడం జరిగింది. చట్ట పరిధిలో పనిచేస్తే అందరికీ సంతోషమేనని, చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే ఆమోదయోగ్యం కాదని అన్నారు. తెలిసి చేసిన తెలియక చేసిన నేరం నేరమే అవుతుంది అని ఆమె చెప్పడం జరిగింది. అనంతరం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధి పేరులోనే గ్రామం యొక్క అభివృద్ధి ఉందని… దానిని మనం తప్పు పట్టుగలమా అని ప్రశ్నించడం జరిగింది. కుల బహిష్కరణ, సామాజిక దండనలు, వెలివేతల కారణంగానే విడిసిలపై కేసులు నమోదు చేసిన విషయాన్ని కమిషనర్ గుర్తు చేశారు. అదేవిధంగా చట్ట వ్యతిరేకమైన తీర్మానాలు చేయరాదని కూడా సూచించారు. న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ పద్మావతి చట్టంపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏసిపి రాజా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.