కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్, సెప్టెంబర్ 01 ( లోకంతీరు ) : భారీ వర్షాల నేపథ్యంలో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నెలకొల్పిన కంట్రోల్ రూమ్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్న విధానాన్ని, సంబంధిత అధికారులకు వెంటదివెంట సమాచారం తెలియజేస్తూ అప్రమత్తం చేస్తున్న తీరును పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిని ఎవరికి తెలియజేశారు తదితర వివరాలను కంట్రోల్ రూమ్ లో ఆపరేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న సమాచార పౌర సంబంధాల శాఖ టైపిస్టు అహ్మద్ పాషాను అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్ రూమ్ కు సమాచారం అందిన వెంటనే సంబంధిత ప్రాంతాల అధికారులను అప్రమత్తం చేయాలని, నిరంతరం 24/7 గంటల పాటు కంట్రోల్ రూమ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసినందున పూర్తి జాగరూకతతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. కాగా, వర్షాల వల్ల జిల్లాలో ఎక్కడైనా ఇబ్బందులు నెలకొంటే ప్రజలు ఏ సమయంలోనైనా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08462 – 220183 కు సమాచారం అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ఏ.ఓ ప్రశాంత్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.