
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా విత్తన బంతుల తయారీ.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎస్జీఎఫ్ వినూత్న కార్యక్రమం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫెలోషిప్ (ఐఎస్జీఎఫ్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సాధనతో పాటు పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టడం విశేషం. చుంచుపల్లి మండలంలోని ఎల్ఐసీ కార్యాలయం వెనుక ఉన్న ఐఎస్జీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎస్కే జరీనాబీ నివాసంలో ఆమె ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వివిధ రకాల విత్తనాలతో సీడ్ బాల్స్ తయారు చేసిన సభ్యులు, రానున్న వర్షాకాలంలో కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాల్లో మొక్కల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని వెదజల్లనున్నట్లు తెలిపారు. ఈ విధంగా విత్తన బంతులను విసరడం ద్వారా వర్షపు నీటితో అవి మొలకెత్తి మొక్కలుగా, అనంతరం వృక్షాలుగా ఎదిగే అవకాశముందని నిర్వాహకులు పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సభ్యులు యోగా ఆసనాలు వేసి యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఐఎస్జీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోగాని శ్రీనివాస్, రాష్ట్ర కోఆర్డినేటర్ మహమ్మద్ ఖాసిం, జిల్లా కోఆర్డినేటర్ జ్యోతి రాణి, జిల్లా కోశాధికారి సమ్మయ్య, జాయింట్ సెక్రటరీ కళ్యాణి, ఉమెన్స్ గిల్డ్ జిల్లా కోశాధికారి సోనా, జిల్లా బాధ్యులు నసీం పాషా, శనగ రాంచందర్ రావు, ఖాదర్ మోహినుద్దీన్, చుంచు అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.