Take a fresh look at your lifestyle.

సింగరేణి భూపాలపల్లి ఏరియా సీఈఆర్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.

0 29

సింగరేణి సీఈఆర్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
భూపాలపల్లి ఏరియాలో జనరల్ బాడీ సమావేశం.

క్లబ్ అభివృద్ధికి సభ్యుల సహకారం అవసరమన్న యాజమాన్యం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 12: సింగరేణి భూపాలపల్లి ఏరియా యాజమాన్యం ఆధ్వర్యంలో సీఈఆర్ (CER) క్లబ్‌లో ఆదివారం నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, రాబోయే కార్యక్రమాలు, క్లబ్ నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే అంశాలపై సభ్యులతో విస్తృతంగా చర్చించి, అనంతరం నూతన కమిటీని ఎన్నుకోవడం సమావేశంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా క్లబ్ కార్యకలాపాలు, సభ్యులకు అందిస్తున్న సౌకర్యాలు, భవిష్యత్ కార్యాచరణ, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, సభ్యుల భాగస్వామ్యాన్ని పెంపొందించే చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. క్లబ్‌ను మరింత అభివృద్ధి చేయాలంటే సభ్యులందరి సహకారం, సూచనలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అనంతరం సీఈఆర్ క్లబ్ కార్యదర్శి, ఇతర కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఎస్. శ్యాంసుందర్ మాట్లాడుతూ, క్లబ్ కార్యకలాపాలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు సభ్యులందరి అభిప్రాయాలతో కార్యదర్శి, కమిటీ సభ్యులను ఎన్నుకోవాలని సూచించారు. కార్యదర్శి పదవికి కాపు చంద్రశేఖర్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా, మరెవరూ పోటీకి ముందుకు రాకపోవడంతో సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆయనను క్లబ్ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. అనంతరం సభ్యులు హర్షధ్వానాల మధ్య ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా యు. శ్రీనివాస్, మధిర కొమరయ్య, క్రీడల కెప్టెన్‌గా పాక శ్రీనివాస్, సాంస్కృతిక కెప్టెన్‌గా ఆదిచెర్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జి. శ్రీనివాసరావు, ఆర్. శ్రీకాంత్, ఎం.డి. తాజుద్దీన్, టి. చిరంజీవిలను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ ఎన్నిక పూర్తయిన అనంతరం ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యాంసుందర్ అధికారికంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించి, నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. క్లబ్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో నూతన కమిటీ సమిష్టిగా పనిచేసి క్లబ్ ప్రతిష్ఠను మరింత పెంచాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఒక సంవత్సరం పాటు బాధ్యతలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. సభ్యులందరి సహకారంతో క్లబ్‌ను మరింత అభివృద్ధి చేసి, ఉద్యోగులు, క్రీడాకారులకు ఉపయోగపడే కార్యక్రమాలను విస్తృతంగా చేపడతామని నూతన కార్యదర్శి కాపు చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఘనంగా అభినందించి, క్లబ్ అభివృద్ధికి అందరూ కలిసి కృషి చేయాలని సంకల్పించారు. ఈ సమావేశంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్లు విశ్రాంత్ కుమార్, సాయి కృష్ణ, వంశి, సందీప్, దీప పొద్దర్, క్లరికల్ సిబ్బంది మల్లేపల్లి రవి, ప్రణయ్ సాగర్, స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్స శ్రీనివాస్, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ప్రాతినిధ్య సంఘం ఉపాధ్యక్షుడు బేతెల్లి మధుకర్ రెడ్డి, వివిధ కార్మిక సంఘాల నాయకులు, సీఈఆర్ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.