కలాం ఆశయాలు యువతకు శాశ్వత స్ఫూర్తి: వేముల మహేష్ గౌడ్.
అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఘన నివాళి కార్యక్రమం.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
ఘట్కేసర్, జూలై 27:భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏదులాబాద్ 7వ డివిజన్, ఘనపూర్ గ్రామంలో సోమవారం ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల అమర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్తో పాటు స్థానిక నాయకులు కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశాభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత శాస్త్రవేత్త, ఆదర్శ రాష్ట్రపతిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ వేదికపై నిలబెట్టడంలో కలాం చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువత పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి శ్రమించాలని కలాం ఇచ్చిన సందేశం నేటికీ ప్రతి యువకుడికి మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా దేశసేవనే పరమావధిగా భావించి జీవించిన కలాం ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన విలువల మార్గంలో నడవడమే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నానావత్ రూప్సింగ్ నాయక్, వేముల మమత గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాథం, మాజీ ఉపసర్పంచులు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, మాజీ బ్యాంకు డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి, ఘనపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేముల రాజు గౌడ్, మాజీ వార్డు సభ్యులు గుర్జకుంట నర్సింహా, మెట్టు రమేష్, వేముల శంకర్ గౌడ్, నానావత్ సురేష్ నాయక్, బర్ల అనిత, మాజీ కో-ఆప్షన్ సభ్యురాలు పైళ్ల లతా రెడ్డి, నాయకులు పైళ్ల జంగారెడ్డి, పూస రమేష్ తదితరులు పాల్గొన్నారు.