సీఐ చెన్నూరి శ్రీనివాస్కు పెరక సంఘం నాయకుల అభినందనలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 7:జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన చెన్నూరి శ్రీనివాస్ను పెరక సంఘం నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. భూపాలపల్లి పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు పోలీసు శాఖ మరింత చేరువగా పనిచేయాలని ఆకాంక్షించారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించేందుకు సీఐ శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. పట్టణంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీసు శాఖ చేపట్టే చర్యలకు తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. సీఐ చెన్నూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ప్రజలు తమకు ఎదురయ్యే సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని, ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి సంఘం అధ్యక్షుడు భారత శ్రీనివాస్, పెరక సంఘం నాయకులు దిడ్డి శ్రీనివాస్, కర్రె రమేష్, పెరక రాజేష్, కరడే సతీష్, పెరక సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు కార్కురి సతీష్ తదితరులు పాల్గొన్నారు.