
ఫ్రంట్లైన్ సూపర్వైజర్లకు సమగ్ర శిక్షణ.
శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న జీఎంలు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
రామగిరి, సెప్టెంబర్ 14: ఫ్రంట్లైన్ సూపర్వైజర్లు విధి నిర్వహణలో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆర్జీ-3 జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా జనరల్ మేనేజర్ కోలిపాక నాగేశ్వరరావు సూచించారు.
ఆర్జీ-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియా (ఏపీఏ) డివిజన్ల ఫ్రంట్లైన్ సూపర్వైజర్ల కోసం సోమవారం అడ్రియాల ప్రాజెక్టు ఏరియా జీటీసీలో నిర్వహించిన స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఇరువురు జీఎంలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో అవసరమైన నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, భద్రతా ప్రమాణాలు, సమర్థవంతమైన పర్యవేక్షణ తదితర అంశాలపై సూపర్వైజర్లకు శిక్షణ అందించారు.
సంస్థ ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు కార్మికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జీఎంలు సూచించారు. శిక్షణ ద్వారా పొందిన జ్ఞానం, నైపుణ్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి సంస్థ అభివృద్ధికి సూపర్వైజర్లు తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షించారు.