కమీషనరేట్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు.
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి.
సీపీ అంబర్ కిషోర్ ఝా.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని టౌన్, సెప్టెంబర్ 14:రామగుండం పోలీస్ కమీషనరేట్ హెడ్క్వార్టర్స్లో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కమీషనరేట్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీపీ ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలా చూడాలని, ప్రజల కష్టాలను తొలగించి వారి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మహాగణపతిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ సూచనల మేరకు వినాయక మండపాల నిర్వాహకులు, యువత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో నేటి నుంచి నిమజ్జనం వరకు ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె.శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఆర్ఐలు మల్లేశం, శేఖర్, రమేష్, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నవీన్, ఉపాధ్యక్షుడు తిరుపతి, సంఘ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.