రైతు భీమాకు దరఖాస్తు చేసుకోవాలి
– మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షులు నాగరాజ్ గౌడ్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 22 ( లోకంతీరు ) : జిల్లాలోని బీబీపేట్ మండలంలో జూన్ 28 వ తేదీ వరకు నూతనంగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల లోపు వయస్సు కల రైతులు భీమాకు అర్హులని వారు 2024-25 సంవత్సరంకు భీమా ధరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమా నమోదు చేసుకున్న రైతు మరణిస్తే, రైతు కుటుంబానికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల భీమా ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఒక్క గుంట నుంచి ఎన్ని ఎకరాలు ఉన్న రైతు అయినా ప్రమాదవశాత్తు, ఇతర కారణాల వల్ల మరణించిన రైతు కుటుంబాలు ఆగం కావద్దని వారిని ఆర్థికంగా అదుకునే ఉద్దేశంతో వారి సంక్షేమం కోసం లబ్ధి చేకూరుస్తూన్న రైతు భీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యధావిధిగా కొనసాగించడం హర్షణియమన్నారు. రైతులు భీమా దరఖాస్తు ఫారం నింపి దానితో పాటు నూతనంగా వచ్చిన పట్టా పాస్ బుక్, రైతు ఆధార్ కార్డు, నామిని ఆధార్ కార్డు, ఒకవేళ నామిని 18 సంవత్సరాలకు తక్కువగా ఉన్నచో ఆపాయింటీ ఆధార్ కార్డు, ఆయా ధృవపత్రాల జిరాక్సులు బీమా ఫారం తో ఆగస్టు 5 తేదీ లోపు జత చేసి క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల్లో సంబంధిత ఏఈవోలకు నేరుగా రైతులు అందించాలని ఆయన కోరారు. గతంలో నమోదు చేసుకున్న రైతుల భీమా యదావిధిగా కొనసాగుతుందన్నారు. ఒకవేళ నామిని పేర్లలో మార్పులకు అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఒక లక్ష వరకు రుణమాఫీ చేసి రైతుల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతు కుటుంబాలకు దీమా కల్పించేందుకు రైతు బీమా పథకాన్ని యధావిధిగా కొనసాగిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ కి రైతాంగం ఎల్లవేళలా రుణపడి వుంటుందని రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.