పోలియో రహిత సమాజం కోసం సమిష్టిగా కృషి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
టేకులపల్లి, జూన్ 28:పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపునిచ్చారు. ఈ దిశగా సమన్వయంతో పనిచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలను ఆయన అభినందించారు. ఆదివారం టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు క్రాస్రోడ్డు అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలియో బూత్ను ఎమ్మెల్యే సందర్శించి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోలియో నిర్మూలన లక్ష్య సాధనలో భాగంగా ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చైతన్యంతో ముందుకు వచ్చి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని, ఒక్క చిన్నారి కూడా మిగలకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డా. కంచర్ల వెంకటేష్, సర్పంచ్ పూల్ బంతి, ఉప సర్పంచ్ చేతుల నాగేశ్వరరావు, కోరం సురేందర్, కోయగూడెం సర్పంచ్ కోరం బోసు రాందాస్ నాయక్, కాలే ప్రసాద్, శివలాల్, లింబియా, రవి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ అధికారి చంద్రకళ, ఆరోగ్య విస్తరణ అధికారి పున్నమయ్య, సూపర్వైజర్ కౌసల్య, ఫార్మసీ అధికారి కిరణ్ కుమారి, నర్సింగ్ అధికారి సుస్మిత, అంగన్వాడీ సూపర్వైజర్లు నిర్మల, లక్ష్మి, పద్మ, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.