భూపాలపల్లిలో గ్రామ పాలన అధికారులకు కొత్త కార్యాలయం.
ప్రారంభించిన ఆర్డీవో హరికృష్ణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, ఆగస్టు 15: గ్రామ పాలన అధికారుల కార్యాలయానికి నూతన భవనం అందుబాటులోకి రావడంతో అధికారులు, ప్రజలకు ఇబ్బందులు తొలగినట్లేనని భూపాలపల్లి ఆర్డీవో హరికృష్ణ అన్నారు. భూపాలపల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన గ్రామ పాలన అధికారుల కార్యాలయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో ప్రవేశపెట్టిన గ్రామ పాలన వ్యవస్థలో భాగంగా భూపాలపల్లి మండలానికి 17 మంది గ్రామ పాలన అధికారులను కేటాయించినట్లు తెలిపారు. తహశీల్దార్ కార్యాలయంలో సరిపడా గదులు లేకపోవడంతో అధికారులు విధులు నిర్వహించడంతో పాటు ప్రజలకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురయ్యేవని పేర్కొన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే నూతన కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని తెలిపారు. అధికారులు వేగంగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం అభినందనీయమని, నూతన కార్యాలయం గ్రామ పాలన అధికారులతో పాటు ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని ఆర్డీవో పేర్కొన్నారు. భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్కు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం మండల గ్రామ పాలన అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో హరికృష్ణ, తహశీల్దార్ లక్ష్మీ రాజయ్య, డిప్యూటీ తహశీల్దార్ అంజలి రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ నిరంజన్, గిర్ధవార్ రామస్వామిలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలన అధికారుల సంఘం మండల అధ్యక్షుడు కుమార్, జిల్లా అధ్యక్షుడు జితేందర్, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, మండల గ్రామ పాలన అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.