ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల్లో జయశంకర్ జిల్లా ప్రతినిధులు.
భారీగా తరలివెళ్లిన సీపీఐ, ఏఐటీయూసీ శ్రేణులు.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 7: కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలకు జయశంకర్-భూపాలపల్లి జిల్లాకు చెందిన వివిధ రంగాల కార్మిక ప్రతినిధులు హాజరయ్యారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ తెలిపారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్న మహాసభల్లో భాగంగా 6న జరిగిన బహిరంగ సభకు జిల్లా నుంచి సుమారు 200 మంది కార్మికులు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారని పేర్కొన్నారు. ప్రతినిధుల మహాసభకు సింగరేణి విభాగం నుంచి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్, బ్రాంచ్ సహాయ కార్యదర్శి జి. శ్రీనివాస్, ఎం.డి. అసిఫ్ పాషా, సింగరేణి కాంట్రాక్టు విభాగం నుంచి నూకల చంద్రమౌళి, కేటీపీపీ నుంచి కోల శ్యామ్, ధర్మారావు, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నుంచి కొరిమి సుగుణ, భవన నిర్మాణ రంగం నుంచి వెంకటేష్ పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ.. జయశంకర్-భూపాలపల్లి జిల్లాలోని కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మహాసభల్లో ఎండగట్టనున్నట్లు తెలిపారు. కార్మిక సమస్యలపై తీర్మానాలు ప్రవేశపెట్టి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుని పోరాటాలకు సిద్ధం కావడానికి ఈ మహాసభలు దోహదపడతాయని అన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల విజయవంతానికి కృషి చేస్తున్న జయశంకర్-భూపాలపల్లి జిల్లా కార్మిక వర్గానికి ఆయన విప్లవ ధన్యవాదాలు తెలిపారు.