రోడ్డుపై అక్రమ పార్కింగ్తో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం.
వాహనదారులు, బాటసారులకు నిత్యం ఇబ్బందులు.
ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 31: భూపాలపల్లి పట్టణంలో ప్రధాన రహదారులపై నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రహదారులను ఆక్రమిస్తూ ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేయడంతో వాహనదారులు, బాటసారులు ప్రతిరోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని వాణిజ్య సముదాయాలు, స్వీట్ హౌస్లు, కిరాణా దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల ముందు కొనుగోలుదారులు తమ ద్విచక్ర వాహనాలను రహదారిపైనే నిలిపివేయడం వల్ల రోడ్డు వెడల్పు తగ్గిపోతోంది. దీంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడటమే కాకుండా, కాలినడకన వెళ్లే వారికి కూడా ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో ఇతర వాహనదారులు అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సిన పరిస్థితులు ఏర్పడి చిన్నపాటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ప్రజలు చెబుతున్నారు. దుకాణాల యజమానులు తమ వినియోగదారులకు తగిన పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే రహదారులపై అక్రమంగా వాహనాలు నిలిపే వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి జరిమానాలు విధించాలని సూచిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో స్పష్టమైన “నో పార్కింగ్” బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రహదారులపై అక్రమ పార్కింగ్ను అరికట్టేందుకు సంబంధిత అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.