భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.12 కోట్ల అత్యాధునిక ఎం.ఆర్.ఐ. మిషన్ : వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి.
భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.12 కోట్ల అత్యాధునిక ఎం.ఆర్.ఐ. మిషన్.
హైదరాబాద్ నుండి వర్చువల్ గా ప్రారంభించిన ముఖ్యమంత్రి.
ప్రజలకు మరింత చేరువ కానున్న నాణ్యమైన వైద్య సేవలు: ఎమ్మెల్యే.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్/భూపాలపల్లి, జూన్ 30:జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో కీలక అడుగు పడింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎం.ఆర్.ఐ. మిషన్ను మంగళవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, వేముల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ, భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మారై మిషన్ అందుబాటులోకి రావడం జిల్లాలో వైద్య రంగ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఇప్పటి వరకు ఎమ్మారై పరీక్షల కోసం ఇతర పట్టణాలు, నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై జిల్లా కేంద్రంలోనే అత్యాధునిక వైద్య పరీక్షలు నిర్వహించుకునే అవకాశం ప్రజలకు లభిస్తుందని పేర్కొన్నారు. రూ.12 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక పరికరం ద్వారా రోగులకు వేగవంతమైన, నాణ్యమైన నిర్ధారణ సేవలు అందుతాయని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుని మెరుగైన ఆరోగ్య సేవలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి ఎమ్మారై మిషన్ మంజూరు చేసి అందుబాటులోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కృతజ్ఞతలు తెలిపారు.