
పెద్దమ్మతల్లి ఆలయానికి రూ.15 లక్షల విలువైన రథం విరాళం.
అమెరికా ప్రవాస దంపతుల దాతృత్వం.. రథోత్సవ కానుకగా 18 అడుగుల రథం సమర్పణ.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
పాల్వంచ, జూలై 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కేశవాపురం–జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న శ్రీ పెద్దమ్మతల్లి దేవాలయానికి అమ్మవారి రథోత్సవ కానుకగా అమెరికాలోని శ్రీ వెన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత కిలారు రాజశేఖర్, ప్రతిమ దంపతులు తమ కుమార్తె రిషిత, కుమారుడు రిషిక్లతో కలిసి రూ.15 లక్షల విలువైన 18 అడుగుల ఎత్తైన రథాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి అద్దంకి విజయకుమార్ దాతల కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, అమ్మవారి రథోత్సవానికి వినియోగించేలా రథాన్ని ఆలయ తరఫున అధికారికంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం దాతలు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని ఆలయ అధికారులు పేర్కొన్నారు. రథం సమర్పణతో రానున్న ఉత్సవాల్లో అమ్మవారి రథోత్సవం మరింత వైభవంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిలారు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కిలారు బోస్, హైమావతి దంపతులు, పినపాక పట్టినగర్ గ్రామస్తులు, బూర్గంపాడు మండలానికి చెందిన దాతల కుటుంబ సభ్యులు, మాజీ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి, మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు బాలినేని నాగేశ్వరరావు, మహిపతి రామలింగం, గ్రామ ప్రముఖులు చెవుగాని పాపారావు, బానోత్ బాలాజీ, బాదర్ల జోషి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.