ప్రజా పాలనలో మహాలక్ష్మి పథకం కోసం సర్వే బృందాలు
– జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , ఫిబ్రవరి 07 ( లోకం తీరు ) : ప్రజాపాలనలో భాగంగా మహాలక్ష్మి పధకం క్రింద ప్రజలు సమర్పించిన ధరఖాస్తులలో తప్పిదాలను సవరించేందుకు సర్వే బృందాలు నియమించామని, ఆ బృందాలు ఈ నెల 10 వరకు గ్రామాలలో పర్యటిస్తాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందించాలని ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో గత డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిశిలించగా పలువురు సమగ్ర వివరాలను పేర్కొనలేదని వెల్లడయ్యిందని అన్నారు.ప్రధానంగా దరఖాస్తులో గ్యాస్ ఏజెన్సీ పేరు, కన్స్యూమర్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్ వంటి వివరాలను సరిగా పొందుపర్చలేదని తెలిపారు అర్హులైన ఏ ఒక్కరు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను సరిచెయుటకు ప్రత్యేక యాప్ ను రూపొందించిందని, ఈ యాప్ సహాయంతో వివరాలను సరి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. తప్పిదాలను సరిచెయుటకు మండలాల పరిధిలో ఎంపీడీఓ లు, తహశీల్దార్ లు, మున్సిపల్ పట్టణాలలో మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారుల నేతృత్వంలో గ్రామ, మునిసిపల్ స్థాయిలో ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేసి నేటి నుండి (బుధవారం) ప్రతి బృందం రోజు కనీసం 30 దరఖాస్తులను పరిశీలించేలా ఆదేశించామని, ప్రజలు కూడా సర్వే బృందాలకు సహకరించవలసినదిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. దరఖాస్తులు సక్రమంగా ఉన్న వాటికి సంబంధించి వాటి ఆమోదం నిమిత్తం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని, సర్వే బృందాలు తమను సంప్రదించలేదని ఇతర దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.