ఈ నెల 28 నుండి ఇంటర్ పరీక్షలు.. పకడ్బందీగా ఏర్పాట్లు..అదనపు కలెక్టర్..
జగిత్యాల, ఫిబ్రవరి 20 ( లోకంతీరు ) : ఈ నెల 28 నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయని,పరీక్షల నిర్వహణ పకడ్బందీగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బి.ఎస్.లత అన్నారు. మంగళవారం రోజున ఐడిఓసి సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరాల వార్షిక పరీక్షల నిర్వహణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదనపు కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్షలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 14,542 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నరని, ఇందులో 12400 మంది జనరల్, 2142 వొకేషనల్ విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరంలో 5717, రెండవ సంవత్సరంలో 6683 మంది,వొకేషనల్ కోర్సులో మొదటి సంవత్సరంలో 949, రెండవ సంవత్సరంలో 1193 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు.
పరీక్ష కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రతీ కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటుచేయాలని, 144 సెక్షన్ విధించాలని, పరీక్ష సమయంలో జీరాక్స్ కేంద్రాలను మూసివేయాలని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో పోలీసు బందో బస్తు ఏర్పాటుచేయాలనీ, పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి అగ్నిమాపక ప్రమాదాలు జరుగకుండా ముందస్తు ఏర్పాట్లు పరిశీలించాలని అగ్ని మాపక శాఖ అధికారులను ఆదేశించారు. ఇన్విజిలేటర్ ల కోసం అవసరమైన ఉపాధ్యాయులను డిప్యూట్ చేయాలని విద్య శాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే వారంలోగా విద్యార్థులను పరీక్షలకు సంసిద్దులుగా చేయాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు సమయానికి ముందే ఆర్టీసి బస్సులను రీ షెడ్యూల్ చేయాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో జిల్లా ఇంటర్మీడియట్ విద్య అధికారి నారాయణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.