సింగరేణి పవర్ ప్లాంట్ను సందర్శించిన సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి
కొత్త 800 మెగావాట్ల థర్మల్ యూనిట్ పనుల పురోగతిపై సమీక్ష
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
శ్రీరాంపూర్, మే 29: సింగరేణి సంస్థ జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ను సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి శుక్రవారం సందర్శించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న కొత్త 800 మెగావాట్ల థర్మల్ పవర్ యూనిట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం సీఎండీ రెస్క్యూ సేఫ్టీ కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. ప్లాంట్ పరిసరాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. థర్మల్, సౌర విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమాల పురోగతిని కూడా సమీక్షించి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ, కొప్పుల వెంకటేశ్వర్లు, మోకాళ్ల తిరుమలరావు, బాదావత్ వెంకన్న జాదవ్, జీఎంలు మునిగంటి శ్రీనివాస్, తాడబోయిన శ్రీనివాస్తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.