విద్యార్థులపై లాఠీచార్జ్ అమానుషం.
కేంద్ర ప్రభుత్వ అణచివేత ధోరణి ప్రజాస్వామ్యానికి విరుద్ధం.
యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కాటారం, జూలై 21: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీచార్జ్ చేయడాన్ని యూవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థులపై అణచివేత చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, కేంద్ర ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హక్కుల సాధన కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థుల గొంతు నొక్కడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికీ తగదన్నారు. విద్యార్థుల సమస్యలను బలప్రయోగంతో కాకుండా చర్చల ద్వారా పరిష్కరించాలని సూచించారు. లాఠీచార్జ్కు కారణమైన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, ఘటనలో గాయపడిన విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు.