
37 ఏళ్ల విశిష్ట సేవలకు ఘన వీడ్కోలు.
పదవీ విరమణ పొందిన పర్సనల్ మేనేజర్ కావూరి మారుతికి సన్మానం.
విధి నిర్వహణలో ఆయన సేవలు చిరస్మరణీయం: ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి.
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
జయశంకర్-భూపాలపల్లి, జూలై 31: సింగరేణి సంస్థలో 37 సంవత్సరాల పాటు అంకితభావంతో సేవలందించిన భూపాలపల్లి ఏరియా పర్సనల్ మేనేజర్ కావూరి మారుతి పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికీ పదవీ విరమణ సహజమైన దశేనని, అయితే తమ సేవలతో సంస్థ అభివృద్ధికి చెరగని ముద్ర వేసిన అధికారులు ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. కావూరి మారుతి పర్సనల్ విభాగంలో పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమం, కార్మిక–యాజమాన్య సత్సంబంధాల పరిరక్షణ, సేవా వ్యవహారాల సమర్థ నిర్వహణ, పారదర్శక పరిపాలన, మానవ వనరుల అభివృద్ధిలో విశేష సేవలందించారని కొనియాడారు. పదోన్నతులు, బదిలీలు, సేవా సంబంధిత అంశాల నిర్వహణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, క్రమశిక్షణతో కూడిన పరిపాలన, యువ ఉద్యోగులకు మార్గనిర్దేశం వంటి అనేక రంగాల్లో ఆయన అందించిన సేవలు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సన్మానానికి స్పందించిన కావూరి మారుతి మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో పనిచేయడం తన జీవితంలో మరపురాని అనుభవమని అన్నారు. ఉద్యోగ జీవితంలో తనకు సహకరించిన యాజమాన్యం, ఉన్నతాధికారులు, సహోద్యోగులు, ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతోనే తన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించగలిగానని పేర్కొంటూ, సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (సివిల్) రవికుమార్, ఏజీఎం (ఐఈడీ) జ్యోతి, ఏరియా ఇంజనీర్ పి.వి. సాంబశివరావు, డీజీఎం (ఎఫ్&ఏ) పి. రాజేశ్వర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మాటూరి రవీందర్, ఏరియా సర్వే ఆఫీసర్ శైలేంద్ర కుమార్, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్, వివిధ విభాగాల అధికారులు, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల రమేష్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బి. మధుకర్ రెడ్డి, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.