ఘనంగా గణతంత్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్…
- ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు….
- సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో…

నిజామాబాద్, జనవరి 26 ( లోకం తీరు ) : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి కీలకోపన్యాసం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు డి.అరవింద్, అర్బన్ శాసన సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ నీతూకిరణ్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, పి.యాదిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, ట్రైనీ ఐ.పీ. ఎస్ చైతన్య, డీ.ఎఫ్.ఓ వికాస్ మీనా, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పుర ప్రముఖులు కలెక్టర్ ను కలిసి పరస్పరం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసాపత్రాలు బహూకరించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు.
ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
రిపబ్లిక్ డే వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. ఎదనిండా దేశభక్తి భావాన్ని నింపుకుని తమ ప్రదర్శనలతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు వన్నెలద్దారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన బాలబాలికలు చూడచక్కని నృత్య రీతులను అలవోకగా ప్రదర్శిస్తూ ఔరా అనిపించారు. బాలబాలికలు ఏకరూప దుస్తులు ధరించి తమ అభినయంతో అలరింపజేశారు. ఈ సందర్భంగా చిన్నారులను కలెక్టర్ తో పాటు ఇతర అతిథులు, జిల్లా ఉన్నతాధికారులు వారి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, ఆఫీసర్స్ క్లబ్ లో జిల్లా పాలనాధికారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు.
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో…
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ పి.యాదిరెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, కలెక్టరేట్ ఏ. ఓ ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
—————————
నిజామాబాద్ జిల్లా పౌర సంబంధాల అధికారి గారిచే జారీ చేయనైనది.

1