ఈనెల 26న హైదరాబాద్లో తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల రాష్ట్ర సదస్సు
పద్మశాలి ఉద్యోగులంతా పాల్గొని విజయవంతం చేయాలి: జిల్లా అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
భద్రాద్రి-కొత్తగూడెం, జూన్ 21:తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లోని ఎల్బీ నగర్ స్వకులశాలి సమాజ భవనంలో రాష్ట్ర స్థాయి పద్మశాలి ఉద్యోగుల సదస్సు నిర్వహించనున్నట్లు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అనంతుల లక్ష్మీనారాయణ తెలిపారు. సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు ఈగ వెంకటేశ్వర్లు నాయకత్వంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో పద్మశాలి ఉద్యోగుల సంక్షేమం, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, సంఘం భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పద్మశాలి ఉద్యోగులు ఒకే వేదికపై సమావేశమై పరస్పర అవగాహన పెంపొందించుకోవడంతో పాటు సంఘ బలోపేతానికి ఈ సదస్సు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పద్మశాలి ఉద్యోగులందరూ పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో దూలం నటరాజ్, గొట్టిముక్కుల మహేందర్, పసునూతి వెంకటేశ్వర్లు, కొండి పద్మజ, పుట్ట లింగమూర్తి, దిగిదారి రాము తదితరులు పాల్గొన్నారు.