రాష్ట్ర ఇంధన అవసరాలకు అనుగుణంగా సింగరేణి కొత్త బొగ్గు బ్లాక్ల సాధన వేగవంతం చేయాలి: భట్టి విక్రమార్క.
రాష్ట్ర ఇంధన అవసరాలకు అనుగుణంగా సింగరేణి కొత్త బొగ్గు బ్లాక్ల సాధన వేగవంతం చేయాలి.
గత ప్రభుత్వం కొత్త బ్లాక్ల సాధనలో పూర్తిగా విఫలమైంది.
తాడిచర్ల-2లో నిర్ణీత గడువులో ఉత్పత్తి ప్రారంభించాలి.
కోయగూడెం–3, సత్తుపల్లి–2 బ్లాక్లను సింగరేణికే దక్కేలా చర్యలు తీసుకోవాలి.
విద్యుత్ శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు.
(ప్రజాలక్ష్యం ప్రత్యేక ప్రతినిధి)
హైదరాబాద్, జూలై 18:రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో భవిష్యత్తులో పెరిగే విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు. శనివారం హైదరాబాద్లోని టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో నిర్వహించిన విద్యుత్ శాఖ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఇంధన భద్రత కోసం సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాక్ల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కొత్త బొగ్గు బ్లాక్లను సాధించడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేటాయించిన తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ లో నిర్ణీత కాలపరిమితిలో అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. అలాగే భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోయగూడెం–3 మరియు సత్తుపల్లి–2 బొగ్గు బ్లాక్లను కూడా సింగరేణికి దక్కేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల తాగునీటి అవసరాలు, రైతులకు వ్యవసాయ విద్యుత్ సరఫరా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో విద్యుత్ రంగానికి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేలా అధికారులు ముందుచూపుతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేసి విద్యుత్ సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రతి విద్యుత్ వినియోగదారుడికి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందేలా సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ డా. బుద్ధప్రకాశ్ జ్యోతి, సింగరేణి ఈడీ (కోల్ మూవ్మెంట్) బి. వెంకన్న జాదవ్తో పాటు జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.