కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శం.
కొమురయ్య పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమించాలి.
నల్ల నేలపై పొడిచిన ఎర్ర పొద్దు కొమురయ్య. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్.
జయశంకర్-భూపాలపల్లి, సెప్టెంబర్ 6:సింగరేణి కార్మికుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన యోధుడు కామ్రేడ్ కొమురయ్య ఆశయాలు నేటి తరానికి ఆదర్శనీయమని ఏఐటీయూసి అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు. కొమురయ్య పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య భవన్లోబ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్ అధ్యక్షతన కొమురయ్య 30వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కొరిమి రాజ్కుమార్ తొలుత కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భూపాలపల్లి ఏరియాలోని వివిధ మైన్లు, విభాగాల్లోనూ కొమురయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ.. కార్మిక హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించి, అనేక హక్కులను సాధించిన కొమురయ్య కార్మికుల జాతిపితగా నిలిచారని కొనియాడారు. నల్ల నేలపై పొడిచిన ఎర్ర పొద్దులా కార్మిక వర్గంలో చైతన్యం నింపి, ఏఐటీయూసీ ఎర్రజెండా ఆధ్వర్యంలో హక్కుల కోసం ఉద్యమించిన గొప్ప నాయకుడని అన్నారు. కార్మికుల కష్టనష్టాల్లో అండగా నిలిచిన కొమురయ్య పెన్షన్ కోసం కూడా పోరాటం చేశారని, నేడు కార్మికులు పొందుతున్న పెన్షన్ ఆయన పోరాట ఫలితమేనని గుర్తుచేశారు. మనుబోతుల ఇంటిపేరును యూనియన్ కొమురయ్యగా మార్చే స్థాయిలో కార్మిక వర్గంలో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. నేటి తరానికి కొమురయ్య ఆశయాలు, పోరాట చరిత్రను తెలియజేసి, వాటిని కొనసాగించాల్సిన బాధ్యత కార్మికులపై ఉందన్నారు. కొమురయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. రాబోయే రోజుల్లో కొమురయ్య పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం మరిన్ని ఉద్యమాలు చేపట్టాలని రాజ్కుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్లు మాతంగి రామచందర్, గురుజేపల్లి సుధాకర్రెడ్డి, నూకల చంద్రమౌళి, జి. శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, తాళ్ల పోశం, తోట రామచందర్, ఎండీ కరీముల్లా, ఎల్. శంకర్, పి. శ్రీనివాస్, ఫిట్ సెక్రటరీలు, టెంపుల్ కమిటీ సభ్యులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు.