నియోజకవర్గ అభివృద్ధిపై వేముల సమీక్ష…
- పెండింగ్ పనులు, పథకాల అమలు తీరుపై ఆరా..
- కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పెండింగ్ ఫైల్స్ లేకుండా చూడాలి..
- అధికారులు,ప్రజాప్రతినిధులకు సూచించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి…

బాల్కొండ నియోజకవర్గం, జనవరి 29( లోకం తీరు ) : బాల్కొండ నియోజకవర్గంలో పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల పురోగతిపై బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. సోమవారం నియోజకవర్గ అధికారులు ఆర్ డి ఓ , డి ఎల్ పి ఓ మరియు MRO,S,ఎంపీడీఓ లు ప్రజాప్రతినిదులు ఎంపీపీ ,జడ్పీటీసీ లతో బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష చేశారు. అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. పనులు ఆగకుండా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులపై ఆరా తీశారు. నియోజకవర్గంలో సుమారు మొత్తం 95000 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇందులో కొత్త రేషన్కార్డుల కోసం 20వేల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. పాత రేషన్కార్డుల పేర్ల మార్పుల కోసం మరో నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఈ దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ ఎంత వరకు వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నారు వేముల ప్రశాంత్రెడ్డి. ధరణి అమలు తీరుపై చర్చించారు. క్లియర్గా ఉన్న టైటిళ్లను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్లో పెట్టొద్దన్నారు. కలెక్టర్ వద్ద కానీ,సీ సీ ఎల్ ఏ లో పెండింగ్లో ఉన్న క్లియర్ ఫైల్స్ విషయం తన దృష్టికి తీసుకురావాలని,వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు.
మండలాల వారీగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కొనసాగుతున్న ఉపాధి పనుల పురోగతిపై అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. పనుల లక్ష్యాన్ని చేరుకుంటున్నామా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఉపాధి హామీ పనులు వేగవంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ ఫైళ్లు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయించుకోవాలని,ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఆ బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకోవాలని సూచించారు.