నాణ్యమైన వైద్య సేవలు అందించాలి

కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 21 (లోకంతీరు) : రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఉన్న రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జ్వరాలు, కాళ్ల నొప్పులు ఉన్నాయని రోగులు తెలిపారు. ఆస్పత్రిలో ఉన్న ఇన్వార్డ్, ప్రసవ గదులు పరిశీలించారు. ఈ సందర్భంగా మండల సమైక్య మహిళలు కలెక్టర్ కు పుష్ప గుచ్చం అందజేశారు. అనంతరం కలెక్టర్ కు రాఖీ కట్టారు. గ్రామ సమైక్య సంఘ సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వ భవనం ఇవ్వాలని మహిళలు కోరారు. ప్రభుత్వ భవనం గ్రామంలో ఖాళీగా ఉంటే మండల స్థాయి అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ మహిళలకు సూచించారు.